కర్నాటకలో సిద్ధూకు చెక్ చెప్పేందుకు రంగంలోకి 50వేలమంది స్వయంసేవకులు
బెంగళూరు: కర్నాటక ఎన్నికల్లో హిందూమతంలో చిచ్చు పెట్టి, ఇతర మార్గాలతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలని భావిస్తోందని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు బీజేపీ తరఫున రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆరెస్సెస్) కార్యకర్తలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. గుజరాత్లో బీజేపీ గెలుపు కోసం ఆరెస్సెస్ పని చేసింది. ఇతర రాష్ట్రాల్లోను పని చేసింది.
ఇప్పుడు కర్నాటకలోను ఆరెస్సెస్ రంగంలోకి దిగింది. ఇప్పటికే 20 వేల మంది స్వయంసేవకులు బీజేపీ గెలుపు కోసం పని చేస్తున్నారు. మరో 30 వేల మంది త్వరలో రంగంలోకి దిగనున్నారు. వీరంతా హిందువులను ఏకతాటి పైకి తీసుకు వచ్చి బీజేపీకి ఓటు బ్యాంకును తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తారు.
ముఖ్యంగా ఆరెస్సెస్ యువతపై ప్రత్యేక దృష్టి సారించింది. సాధ్యమైనంత వరకు యువకులతో సమావేశమవుతున్నారు. ఒక్కొక్కరితోను మాట్లాడుతున్నారు. వీరి కోసం వసతిని కూడా ఏర్పాటు చేశారు. లింగాయత్లకు ప్రత్యేక మతం హోదా ఇవ్వడాన్ని ఆరెస్సెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
'బీజేపీకి కేసీఆర్ పరోక్ష మద్దతు, థర్డ్ ఫ్రంట్ పేరుతో వారికి మేలు'
యువతతో భేటీ అవుతున్న ఆరెస్సెస్ కార్యకర్తలు మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని విడదీసే కుట్రలకు కాంగ్రెస్ పాల్పడుతోందని చెబుతున్నారు.
ఆరెస్సెస్ తొలిసారి తమను అభిమానించే ఓటర్లను రప్పించి బీజేపీకి ఓట్లు వేసేలా బాధ్యతను తమపై వేసుకుంది. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని హిందూ వ్యతిరక ప్రభుత్వంగా సంఘ్ పరివార్ సంస్థలు చెబుతున్నాయి. జాతీయవాద పార్టీగా బీజేపీని చెబుతూ ఆ పార్టీకి ఓటు వేయించే ప్రయత్నాలు చేస్తున్నారు.
వాస్తవానికి తాము చాలామంది కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకం కాదని, వారంతా మంచి హిందువులేనని, వారు ఆరెస్సెస్ను దూషించరని, వ్యక్తిగతంగా తమకు అలాంటి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల పైన ఎలాంటి కోపం లేదని, కానీ సిద్ధరామయ్య భిన్నమైన వ్యక్తి అని, ఆయన కమ్యూనిస్టులా వ్యవహరిస్తున్నారని, సంఘ్ పైన ఆయన విధానాలతో ఆగ్రహంతో ఉన్నామని, ఆయనను సైద్ధాంతికంగా, వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తామని, అందుకే కర్నాటకలో యెడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీకి ఓటు వేయాలని ఆరెస్సెస్ నిర్ణయించిందని చెబుతున్నారు.