జడ్జీలకు సెలవుల్లేవ్: సీజేఐ గొగొయ్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ కేసులు పేరుకుపోవడంతో న్యాయమూర్తులకు 'నో లీవ్(సెలవులు లేవు)' పాలసీని ముందుకు తెచ్చారు. అక్టోబర్ 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగొయ్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.
శుక్రవారం న్యాయమూర్తులతో సమావేశమైన ప్రధాన న్యాయమూర్తి గొగొయ్.. కోర్టుల్లో పెండింగ్ కేసుల క్లియరెన్స్ కోసం పనిదినాల్లో సెలవులు తీసుకోరాదనే విధాన నిర్ణయంపై సంకేతాలు పంపారు.
హైకోర్టుల్లో న్యాయమూర్తులు పనిదినాల్లో సెలవులు తీసుకోకుండా, కోర్టు రూముల్లో విధిగా హాజరుకావాలని జస్టిస్ గొగొయ్ విస్పష్టంగా చెప్పినట్లు ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెల్లడించినట్లు హిందుస్థాన్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
ఇక సుప్రీంకోర్టులో వివిధ బెంచ్లకు కేసుల కేటాయింపు కోసం జస్టిస్ గొగొయ్ నూతన రోస్టర్ను తీసుకువచ్చారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తనతో పాటుగా తన తర్వాత సీనియర్ అయిన మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని బెంచ్లు విచారణ చేపట్టాలని జస్టిస్ గొగొయ్ నిర్ణయించారు.
ప్రాధాన్యత, తక్షణ అవసరాలకు అనుగుణంగా కేసుల విచారణకు నూతన ప్రమాణాలను అనుసరించాలని జస్టిస్ గొగొయ్ సంకేతాలు పంపారు. నిర్షిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే కేసుల తక్షణ విచారణకు ముందుకు రావద్దని ఆయన సూచించారు.