కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు: బీజేపీ ముందున్న మార్గాలివే!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి సంపూర్ణ మెజార్టీ వస్తే ఏ సమస్యా ఉండేది కాదు, కానీ, హంగ్ ఏర్పడటంతో ఇప్పుడు రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో కన్నడ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు 'ఆపరేషన్ కమళం'ను బీజేపీ తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 104 స్థానాలు దక్కించుకున్న తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప గవర్నర్కు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
105కు పెరిగిన బీజేపీ బలం
222స్థానాలకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అసెంబ్లీలో 112మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని బీజేపీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే, బీజేపీకి 104మంది ఎమ్మెల్యేల మద్దతే ఉంది. తాజాగా స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ కూడా బీజేపీకి మద్దతిస్తున్నట్లు తెలుపడంతో ఆ సంఖ్య 105కు చేరింది. అధికారం దక్కించుకుని, నిలబెట్టుకోవాలంటే బీజేపీకి కేవలం మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది.
కాంగ్రెస్కు దూరంగా నలుగురు ఎమ్మెల్యేలు
అయితే, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలోని పలువురు లింగాయత్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ సింగ్, రాజశేఖర్ పాటిల్, నాగేంద్ర, ఎంవై పాటిల్ ఆ పార్టీకి దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే, కాంగ్రెస్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది.
మరో 12మంది కూడా..
ఇది ఇలా ఉంటే, మరో 12మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టడం గమనార్హం. వీరు కూడా బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కాంగ్రెస్.. తమ ఎమ్మెల్యేలను బెంగళూరులోని బిదాడి రిసార్టుకు తరలించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంబీ పాటిల్ మీడియాకు చెప్పారు. అంతకుమించి స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే..
ఎమ్మెల్యేల తమ పార్టీలోకి తీసుకోవడం ఫిరాయింపు నిరోధక చట్టం కిందికి వచ్చే అవకాశం ఉండటంతో బీజేపీ ఇతర మార్గాలను ఎంచుకుంటోంది. విశ్వాస పరీక్ష సమయంలో ఇతర పార్టీల అసంతృప్త ఎమ్మెల్యేలను దూరంగా ఉండేలా చూడనుంది. దీనిపై బీజేపీలో చర్చ సాగుతున్నట్లు సమాచారం. గవర్నర్ తమనే ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తారని బీజేపీ భావిస్తోంది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు.. అతిపెద్ద పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా ఆహ్వానించాలని చెప్పిందని బీజేపీ గుర్తు చేస్తోంది. తమకు ముందుగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తే ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలిపే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది.
రాజీనామాలు మరో అస్త్రం
లేదంటే 4-5మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం ద్వారా సభలో బలం తగ్గించి సులభంగా మెజార్టీ నిరూపించుకోవడం. అయితే, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇందుకు అంగీకరించడం కష్టసాధ్యమైన విషయం. అందుకే, పలువురు ఎమ్మెల్యేలను సభకు దూరంగా ఉంచడమే సులభమైన మార్గంగా బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2008లోలానా.. వాజ్పాయి బాటలోనా..
బీజేపీ అనుకున్నట్లుగా జరగకపోతే మాత్రం యడ్యూరప్ప తగిన సంఖ్యా బలం లేకుండానే విశ్వాస పరీక్ష ఎదుర్కొవాల్సి వస్తుంది. 2008లో లానే అవసరమైన సంఖ్యలో స్వతంత్రులు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తూ రాజీనామాలు చేస్తే మ్యాజిక్ ఫిగర్ తగ్గి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదంటే వాజ్పాయి ఎదుర్కొన్న అనుభవాన్ని యడ్యూరప్ప ఎదుర్కొవాల్సి వస్తుంది.