నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాలు: దేశవ్యాప్త నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడానికి భారతీయ జనతాపార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ వారోత్సవాలకు సేవా సప్తాహం అని పేరు పెట్టింది. వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు గురువారం శ్రీకారం చుట్టింది బీజేపీ. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా ఈ వారోత్సవాల్లో పాల్గొనాలని పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. సేవా వారోత్సవాలను పర్యవేక్షించడానికి ఓ కేంద్ర కమిటీని కూడా ఏర్పాటు చేసింది. పార్టీ సీనియర్ నేతలను ఈ కేంద్ర కమిటీకి సమన్వయకులుగా వ్యవహరిస్తారు.
లష్కరే స్లీపర్ సెల్స్: షెల్టర్ జోన్ గా యూపీ?: వారణాసి, అయోధ్యల్లో ఆత్మాహూతి దాడులకు ప్లాన్
వరుసగా రెండోసారి ప్రమాణం..తొలి పుట్టినరోజు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వచ్చే తొలి పుట్టినరోజు కావడంతో.. దీన్ని చరిత్రలో నిలిచి పోయే విధంగా నిర్వహించాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావించింది. వచ్చేనెల 17వ తేదీన నరేంద్ర మోడీ పుట్టినరోజు. ఈ సందర్భంగా అదే నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాలను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను ఆరంభించారు కమలనాథులు. అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే.. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి కీలక నిర్ణయాలను తీసుకున్న జోష్ లో ఉంది బీజేపీ. అదే ఊపును నరేంద్ర మోడీ పుట్టినరోజు నాడు ప్రదర్శించాలని భావిస్తోంది.
రక్తదానం మొదలుకుని..
వారోత్సవాలను జయప్రదం చేయడానికి బీజేపీ ఓ కేంద్ర కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ సీనియర్ నాయకుడు అవినాష్ రాయ్ ఖన్నాను ఈ కమిటీకి సమన్వయకుడిగా నియమించారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, పార్టీ జాతీయ కార్యదర్శులు సుధా యాదవ్, సునీల్ దేవ్ ధర్ లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సేవా వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు, శ్రేణులు.. గ్రామస్థాయి వరకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు. ఆసుపత్రుల వంటి ప్రజా సంబంధిత కార్యాలయాల ఆవరణల్లో స్వచ్ఛ భారత్ పనులను చేపట్టాల్సి ఉంటుంది. నరేంద్ర మోడీ పరిపాలనలో దేశం సాధించిన ఘన విజయాలను ప్రజలకు వివరించడానికి ప్రత్యేకంగా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.
మోడీ ఘనతను చాటే ఫొటో ఎగ్జిబిషన్లు..
వాటితో పాటు నరేంద్ర మోడీ తొలి అయిదేళ్ల పరిపాలను సాధించిన విజయాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్లను కూడా ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. మండల స్థాయిలో ఈ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సమాచారం. నరేంద్ర మోడీకి చెందిన కొన్ని అరుదైన ఫొటోలను ఈ ఎగ్జిబిషన్లలో ప్రదర్శనకు అందుబాటులో ఉంచనున్నారు. వాటితో పాటు మోడీ సాధించిన విజయాలతో కూడిన పుస్తకాల ప్రదర్శనను కూడా సేవా వారోత్సవాల సందర్భంగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రతినిధులు వెల్లడించారు. దీనికి సంబంధించిన పుస్తకాలను దశలవారీగా అన్ని రాష్ట్రాల బీజేపీ ప్రధాన కార్యాలయాలకు త్వరలోనే పంపిస్తామని చెప్పుకొచ్చారు. న భూతో న భవిష్యత్ అనేలా మోడీ జన్మదిన వారోత్సవాలను నిర్వహిస్తామని పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు.