నగదు రహిత లావాదేవీలు:చెక్బుక్లకు చెక్ పెట్టే యోచన
న్యూఢిల్లీ: చెక్ బుక్లకు కూడ కనుమరుగయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్పై కేంద్ర ప్రభుత్వం కేంద్రీకరించింది. దీంతో చెక్ బుక్ లకు కూడ చెక్ పెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.
దేశంలో నగదు రహిత లావాదేవీలను పెంచడానికి కేంద్రం చర్యలు చేపడుతోంది. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్లను ప్రజలు వినియోగిస్తున్నారు. దేశాన్ని మరింత డిజిటల్ బాట పట్టించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది.
ప్రతి బ్యాంకింగ్ అవసరానికి ఉపయోగించే చెక్ బుక్ సదుపాయానికి చెక్ చెప్పాలని యోచిస్తున్నట్లు కాయిట్ తెలిపింది. ఇదే జరిగితే ప్రజలు డిజిటల్ బాట పట్టడం తప్పనిసరి కానుంది.
'డిజిటల్ రథ్' కార్యక్రమంలో పాల్గొన్న భారత వ్యాపారుల సమాఖ్య సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఈ విషయాన్ని మీడియాకు వివరించారు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే కేంద్రం త్వరలో చెక్బుక్ సదుపాయాన్ని ఉపసంహరించే అవకాశం ఉందన్నారు.
ఇప్పటికే నోట్ల ముద్రణకు రూ.25వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అంతేకాదు వాటి భద్రత, రవాణా కోసం మరో రూ.6వేల కోట్లు వెచ్చిస్తోంది. మరోవైపు బ్యాంకులు డెబిట్ కార్డు లావాదేవీలపై 1 శాతం, క్రెడిట్ కార్డు లావాదేవీలపై 2 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నాయని చెప్పారు
డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించాలంటే నేరుగా బ్యాంకులకే రాయితీ మొత్తాన్ని కేంద్రం అందించి ఛార్జీలు రద్దు ఎత్తివేయాలని సూచించారు. దేశంలో 80 కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయి. అయితే 5 శాతం మాత్రమే నగదురహిత లావాదేవీల కోసం వినియోగిస్తున్నారని తెలిపారు. మిగిలిన 95 శాతం నగదు ఉపసంహరణకే వినియోగిస్తున్నారని చెప్పారు.