దేశం కోసం జీవితానన్ని త్యాగం చేస్తా..! ప్రజలే తన కుటుంబమన్న సోనియా గాంధీ..!!
లక్నో/హైదరాబాద్ : దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, తాము అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని పేర్కొన్నారు. గురువారం వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సోనియా గాంధీ గెలుపొందిన సంగతి తెలిసిందే.
రాయ్ బరేలీ ప్రజలకు ధన్యవాదాలు..! ప్రజల కోసమే తన జీవితమన్న సోనియా..!!
గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్బరేలీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న సోనియా గాంధీ, బీజేపీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్ను ఓడించారు. ఈ నేపథ్యంలో తన విజయానికి దోహదపడిన పార్టీ కార్యకర్తలు, ఇతర పార్టీలు, నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి సోనియా గాంధీ లేఖ రాశారు. నా జీవితం తెరచిన పుస్తకం. మీరే నా కుటుంబం. నాకున్న నిజమైన ఆస్తి మీరే. దేశ ప్రాథమిక విలువలను కాపాడతానని, కాంగ్రెస్ పూర్వపు నేతలు అనుసరించిన విధానాలను కొనసాగిస్తానని మాట ఇస్తున్నానని అన్నారు.
నాది తెరిచిన పుస్తకం..! చివరి నిమిషం వరకూ దేశ సేవకే అంకితమన్న సోనియా..!!
ఈ క్రమంలో నా జీవితాన్ని త్యాగం చేయడానికి ఏమాత్రం వెనుకాడను. రాబోయే రోజులు ఎంతో కఠినంగా ఉంటాయని నాకు తెలుసు. మీ ఆదరణ, మా పట్ల మీరు ప్రదర్శించే విశ్వాసం, మీ అండదండలతో ప్రతీ సవాలును ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ప్రతీ లోక్సభ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా నాపై నమ్మకాన్ని ఉంచి నన్ను ఎన్నుకున్నారు. నా విజయానికి పాటుపడిన ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు, ఎస్పీ, బీఎస్పీ, స్వాభిమాన్ దళ్ పార్టీ నాయకులు.. అందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు అని లేఖలో పేర్కొన్నారు.
దేశ ప్రాథమిక విలువలను గౌరవిస్తా..! ప్రజల ఆదరణ వల్లే గెలిచానన్న సోనియా..!!
కాగా ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పొత్తు పెట్టుకున్న ఎస్పీ-బీఎస్పీ చెరో 38 స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా సొంత నియోజకవర్గాలు ఆమేథీ, రాయ్బరేలీల్లో తమ అభ్యర్థులను నిలపకుండా పరోక్ష మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు కూడా సోనియా కృతఙ్ఞతలు తెలిపారు. ఇక ఆమేథీ నుంచి పోటీ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో యూపీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
నేడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి..! నివాళులు అర్పించిన ప్రముఖులు..!!
భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. దిల్లీలోని శాంతివనంలో నెహ్రూ సమాధి వద్ద పలువురు ప్రముఖులు పుష్ఫగుచ్ఛాలు ఉంచి సోమవారం శ్రద్ధాంజలి ఘటించారు. పడింట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. దేశానికి ఆయన అందించిన సేవల్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాంతివనంలో నెహ్రూకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించిన నెహ్రూ.. అనంతరం భారత తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దేశ పటిష్ఠ నిర్మాణానికి పునాదులు వేసిన నాయకునిగా గుర్తింపు పొందారు.