కాశ్మీర్ కోసం 100సార్లు నరకానికి వెళ్లడానికైనా సిద్ధం: ఒమర్కు మెహబూబా ముఫ్తీ కౌంటర్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ను కాపాడటం కోసం తాను వందసార్లు నరకానికి వెళ్లడానికైనా సిద్ధమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. కాశ్మీర్లో అధికార పీడీపీ, భారతీయ జనతా పార్టీల పొత్తుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శలు చేసిన నేపథ్యంలో ముఫ్తీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పీడీపీ-బీజేపీ పొత్తును 'దెయ్యంతో పొత్తు'గా పోలుస్తూ అబ్దుల్లా వ్యాఖ్యలు చేశారు. 'ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు దెయ్యంతో పొత్తులాగే ఉన్నాయి. మీరు(సీఎం) ఉపవాసాలు, ప్రార్థనలు చేసి ఈ పాలనా విధానాలను మార్చాలి. అప్పుడే మీ రాజకీయ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉంటుంది' అని అబ్దుల్లా విమర్శించారు. దీనికి స్పందించిన ముఫ్తీ.. కాశ్మీర్ ప్రజల శ్రేయస్సు కోసం తాను వందసార్లు నరకానికి వెళ్లడానికి సిద్ధమని అన్నారు.
'నేను నరకానికి వెళ్లాలంటూ ఆయన(ఒమర్ అబ్దుల్లా) ఇప్పుడు ఫత్వా ఇస్తున్నట్లున్నారు. కానీ మనకు దేవుడు స్వర్గాన్ని ఇచ్చాడు. కాశ్మీర్ స్వర్గం. ఆ స్వర్గాన్ని కాపాడటం కోసం వంద సార్లు నరకానికి వెళ్లడానికైనా నేను సిద్ధమే. ప్రజల శ్రేయస్సు కోసం నేను ఆ పని చేస్తే నాకు సంతోషమే. నాకు అదేం పెద్ద కష్టం కాదు' అని మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు.