"మహిళలను రక్షించే యత్నంలో ట్రక్ జర్నలిస్టుపైకి దూసుకెళ్లింది"
భోపాల్: మహిళలను రక్షించడానికి తాను ప్రయత్నించే క్రమంలోనే తన ట్రక్ జర్నలిస్టు సందీప్ శర్మ బైక్పై దూసుకెళ్లిందని డ్రైవర్ చెప్పాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇసుక మాఫియాపై పరిశోధనాత్మక కథనాలు రాస్తున్న టీవీ జర్నలిస్టు సందీప్ శర్మ ట్రక్ కింద పడి మరణించిన విషయం తెలిసిందే.
ట్రక్ డ్రైవర్ రణబీర్ యాదవ్ను పోలీసులు సోమవారం రాత్రి బింద్లో అరెస్టు చేశారు. అతను గడుపురా గ్రామానికి చెందినవాడు. ఎంపి 07 హెచ్బి 4164 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న ట్రక్ గ్వాలియర్కు చెందిన భాస్కర్ శర్మ పేరు మీద ఉంది.
మహిళలను రక్షించేందుకు తాను మలుపు తిప్పానని, తాను సైడ్ గ్లాసులు కూడా చూడలేదని నిందితుడు చెప్పాడు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు డ్రైవర్ను విచారిస్తున్నారు.
సందీప్ శర్మ బైకుపై వెళ్తుండగా అతనిపైకి ట్రక్కు దూసుకొచ్చి, దాని కింద పడి మరణించాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సిసీటివి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇసుక మాఫియాపై కథనాలు రాస్తున్న తనకు ప్రాణహాని ఉందని గతంలో సందీప్ శర్మ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.