సర్జికల్ స్ట్రైక్ 2 తర్వాత బీజేపీ గ్రాఫ్ పెరిగింది..పొత్తులపై పునరాలోచనలో మహాకూటమి
సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడి చేసిన తర్వాత ప్రతీకారచర్యల్లో భాగంగా భారత్ పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులు చేసేందుకు ప్రధాని త్రివిధ దళాలకు పూర్తి అధికారాలు కూడా ఇచ్చారు. మోడీ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంతో ఆయన గ్రాఫ్ అమాంతంగా పెరిగిందని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. మరి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టిన పార్టీలు ఇప్పుడు ఏం చేయబోతున్నాయి... మరి కొద్ది రోజుల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బలమైన బీజేపీని ఢీకొట్టేందుకు మహా కూటమి ఎలాంటి వ్యూహరచన చేస్తోంది... అసలు దీనికి నేతృత్వం వహిస్తున్నదెవరు..?
సర్జికల్ స్ట్రైక్ 2 తర్వాత పెరిగిన బీజేపీ గ్రాఫ్
ఎన్నికలకు కొద్దిరోజుల ముందు చోటుచేసుకుంటున్న పరిణామాలు బీజేపీకి కలిసొస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పుల్వామా దాడుల తర్వాత భారత్ పాక్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేయడం దీని వెనక మోడీ నిర్ణయం ఉందనే వార్త బయటకు రావడం బీజేపీ గ్రాఫ్ను పెంచాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే కమలం పార్టీకి వ్యతిరేకంగా కూటమి కట్టిన పార్టీలకు ఈ వాతావరణం ఎంతమాత్రం మింగుడు పడటం లేదనేది అక్షర సత్యమని పలువురు పొలటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. దాడులకంటే కొద్దిరోజుల ముందు తమ రాష్ట్రంలో మిగతా పార్టీలతో శతృత్వం ఉన్నప్పటికీ కేంద్రంలో మోడీని బీజేపీని ఎదుర్కొనేందుకు అవన్నీ మరచి ఒక్కటయ్యాయి విపక్షాలు. అయితే ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీ గ్రాఫ్ పెరగడంతో ఈ పార్టీలు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ను పక్కనబెట్టిన అరవింద్ కేజ్రీవాల్
ఇక మళ్లీ పార్టీల పరిస్థితులను చక్కబెట్టేందుకు రంగంలోకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు దిగినట్లు తెలుస్తోంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో పొత్తు, ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీతో పొత్తుపై మరోసారి ఆలోచించాలని నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్తో కలిసి వెళ్లేది లేదంటూ ఇప్పటికే తేల్చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఇందులో భాగంగానే ఢిల్లీలో ఏడు పార్లమెంటు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులను ఆమ్ఆద్మీ పార్టీ ప్రకటించేసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఆమ్ఆద్మీల మధ్య వైరాన్ని తగ్గించేందుకు మమతా బెనర్జీ రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. జనవరిలో జరిగిన విపక్షాల భేటీలో రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్లు విబేధాలను వీడి ఢిల్లీలో పొత్తుతో వెళ్లాలని ఆ సమయంలో మమతా బెనర్జీనే సూచించడం జరిగింది.
బెంగాల్లో కాంగ్రెస్తో మమతా పొత్తు..?
విపక్షాల కూటమి బలంగా కనిపించాలంటే విబేధాలు వీడి పనిచేయాలనే ఆలోచనతో దీదీ ఉన్నట్లు సమాచారం. అందుకే ముందుగా తన రాష్ట్రంలోనే కాంగ్రెస్తో పొత్తుకు మమతా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇతరులపై తన ఫార్ములాను ఇంప్లిమెంట్ చేసేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. బెంగాల్లో ఉన్న 42 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్తో కలిసి తృణమూల్ కాంగ్రెస్ పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ బద్ధ శత్రువు సీపీఎం ఇప్పటికే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం విశేషం. కాంగ్రెస్ బెంగాల్లో 6 స్థానాల్లో పోటీచేయనుంది. బెంగాల్నుంచి ఇప్పటికే ఆరు సిట్టింగ్ ఎంపీలున్నారని... అందులో నాలుగు కాంగ్రెస్, రెండు సీపీఎం పార్టీకి చెందిన సీట్లుగా ఉన్నాయని ఈ స్థానాలను కదలించడం లేదని సీపీఎం నేత సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాయ్గంజ్ స్థానం కోసం మాత్రం సీపీఎం, కాంగ్రెస్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. రెండు పార్టీలకు ఇక్కడ మంచి బలం ఉండటమే ఇందుకు కారణం. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ దీపాదాస్మున్షి మూడుసార్లు విజయం సాధించగా... ప్రస్తుతం మొహ్మద్ సలీమ్ ఈ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
మొత్తానికి బలమైన మోడీ నేతృత్వంలోని బీజేపీని ఢీకొట్టాలంటే మళ్లీ విపక్షాలు ఓ మెట్టుదిగి పొత్తులపై ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు తమ రాష్ట్రాల్లో సొంతంగా పోటీచేస్తూనే కేంద్రంలో మాత్రం కలిసి పనిచేయాలనే ఆలోచనను పునఃసమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రాల్లో కూడా పొత్తు పెట్టుకుని కలిసి వెళ్లాలనేదానిపై ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫార్ములా వారికి ఎంతవరకు కలిసి వస్తుందనేది తెలియాలంటే ఇంకొంతకాలం వేచిచూడక తప్పదు.