నేడు తీరం దాటనున్న గజ.. అప్రమత్తమైన యంత్రాంగం.. విద్యాసంస్థలకు సెలవు
చెన్నై : గజ తుపాను గురువారం తీరం దాటనుందని ప్రకటించింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్సుందని తెలిపింది. ప్రస్తుతం చెన్నై నుంచి 490, నాగై నుంచి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు చెన్నై వాతావరణ కేంద్రం డైరెక్టర్ బాలచంద్రన్. గురువారం సాయంత్రం కడలూరు - పాంబన్ మధ్య తీరం దాటనుందని.. కారైక్కల్, తిరువారూరు, తంజావూరు, కడలూరు, నాగపట్టణం, పుదుకోట, రామనాథపురం జిల్లాల్లో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్సుందని చెప్పారు.
హైదరాబాద్ లో చలి పులి పంజా.. 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
మిగతా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందన్నారు. మూడు రోజుల పాటు చెన్నైలో మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
గజ తుపాను ఎఫెక్ట్ తో గురువారం కడలూరు, నాగై తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే ఛాన్సుండటంతో.. విపత్తు బృందాలు ముందస్తు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. మరోవైపు కారైక్కాల్, పుదుకోట, కడలూరు, నాగై, రామనాథపురం, తిరువారూరు జిల్లాల్లోని విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు అక్కడి కలెక్టర్లు ప్రకటించారు.
గజ తుపాను తీరం దాటేంతవరకు సముద్ర తీరాలకు ఎవరూ వెళ్లకూడదన్నారు పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి. ముందస్తు చర్యలో భాగంగా కారైక్కాల్ కు విపత్తు సహాయ బృందాలు వెళ్లాయని తెలిపారు. తీరప్రాంతాల్లో నివాసముంటున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.