Today Gold price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, రూ. 41వేల పైకి..
న్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్-అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
దేశ రాజధానిలో రూ. 41వేల పైకి..
ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఆకాన్నంటుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం ఒక్క రోజే రూ.720 పెరగడంతో 10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర రూ. 41,730కి చేరి సరికొత్త జీవనకాల గరిష్టాన్ని చేరుకుంది. వెండి కూడా బంగారం బాటలోనే నడిచింది. రూ. 1,105 పెరిగడంతో కిలో వెండి ధర రూ. 49,430కి చేరింది.
రూ. 1800 పెరుగుదల..
గత మూడు సెషన్లలో బంగారం ధర ఏకంగా రూ. 1,800లకు పైగా పెరగడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు భారీగానే పెరిగాయి. కమాడిటీ ఎక్ఛేంజీల్లో ఔన్స్ బంగారం ధర 2.3శాతం పెరిగింది.
హైదరాబాద్ మార్కెట్లోనూ..
హైదరాబాద్ మార్కెట్లోనూ సోమవారం బంగారం ధర పెరుగుదల నమోదు చేసింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 390 పెరుగడంతో రూ. 41,770కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై కూడా రూ. 390 పెరగడంతో రూ. 38,320కి ఎగిసింది.
బంగారంపై పెట్టుబడులు మళ్లడంతో..
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం, అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో చమురు ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టడం కంటే బంగారంపై పెట్టుబడులు సురక్షితమని మదపరులు భావించడంతో పసిడి, వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి.
మరింత పెరిగే అవకాశం..
బంగారం ధరలపై ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీరేట్లు, జువెల్లరీ మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు లాంటి అంశాలు ప్రభావితం చూపుతాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రానున్న కాలంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్లు నిపుణులు పేర్కొంటున్నారు.