రాజ్యసభలోనూ ఆమోదం: మూడు వ్యవసాయ చట్టాలు ఇక స్క్రాప్: ఎలాంటి చర్చ లేకుండానే..!
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది. లోక్సభ తరహాలోనే ఇక్కడ కూడా ఎలాంటి చర్చలు సాగలేదు. సమగ్రమైన చర్చ జరగాలంటూ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేసినప్పటికీ.. ఫలితం రాలేదు. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే- అది ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు. దీనితో మూడు వ్యవసాయ చట్టాలు ఇక మనుగడలో లేకుండా పోయాయి.
ఈ మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ పునః ప్రారంభమైంది. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభను నిర్వహించారు. షెడ్యూల్ను చేపట్టారు. ఇందులో పొందుపరిచిన విధంగా- సభ కార్యకలాపాలు మొదలైన వేంటనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చిందనే విషయంపై క్లుప్తంగా మాట్లాడారు. దాన్ని సభ ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) యాక్ట్ 2020, ఎసెన్షియల్ కమోడిటీస్ (అమెండ్మెంట్) యాక్ట్ 2020, ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ 2020ని వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఉపసంహరణ బిల్లును రూపొందించామని అన్నారు. కోట్లాదిమంది రైతుల డిమాండ్లు, నిరసన ప్రదర్శనలను తాము పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు.
ఆ వెంటనే డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్.. ఈ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించిన బిల్లు సభ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గె తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి చర్చలు లేకుండా బిల్లును ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. దీనిపై చర్చను చేపట్టాల్సిందేనంటూ పట్టుబట్టారు. సభను సజావుగా సాగనివ్వడానికి అధికార పక్షం చొరవ చూపించాలని సూచించారు.
అంతకుముందు ఇదే బిల్లును లోక్సభ ఆమోదించిన విషయం తెలిసిందే. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎలాంటి చర్చ లేకుండా కీలకమైన ఈ బిల్లును సభామోదం ఎలా పొందుతుందంటూ ప్రతిపక్షానికి చెందిన సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ అంటే ప్రధాని మన్ కీ బాత్ వంటి కార్యక్రమంగా మారిందంటూ కాంగ్రెస్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. దీనిపై చర్చ సాగించేంత వరకూ సభా కార్యకలాపాలను కొనసాగించబోమని అన్నారు.
సభా కార్యకలాపాలు సజావుగా సాగనివ్వకుండా ప్రతిపక్ష పార్టీల సభ్యులు అడ్డుపడుతుండటంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. పునఃప్రారంభమైన తరువాత కూడా అవే దృశ్యాలు సభలో కనిపించాయి. సభా కార్యకలాపాలు ముందుకు సాగడానికి కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన సభ్యులు అడ్డుకున్నారు. వారికి ధీటుగా అధికార పార్టీ సభ్యులు కూడా స్పందించడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనితో స్పీకర్.. లోక్సభను మంగళవారానికి వాయిదా వేశారు.