నేడు వారణాశిలో మోదీ 5 కిలోమీటర్ల విజయోత్సవ ర్యాలీ .. భారీ ఏర్పాట్లు
లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచి రెండోసారి ఘన విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాశిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఇవాళ ఆ నియోజకవర్గంలో పర్యటించబోతున్న మోడీ అక్కడ ప్రజలకు ఈ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టినందుకు కృతజ్ఞతలు చెప్పబోతున్నారు. ఈ ఎన్నికల్లో మోదీ... తన సమీప ఎస్పీ అభ్యర్థి షాలినీ యాదవ్పై 4.7 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తనను మరోసారి గెలిపించినందుకు వారణాసి ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా... 5 కిలోమీటర్ల భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించబోతోంది బీజేపీ. ఇందుకోసం చాలా బ్రహ్మాండమైన విధంగా ఏర్పాట్లు చేశారు . ప్రధాని మోదీ ఫొటోలతో కూడిన బ్యానర్లు ఎక్కడ చూసినా కనువిందు చేస్తున్నాయి. వారణాశి కాషాయ వర్ణం దాల్చింది . తన నియోజకవర్గ ఎంపీ... ప్రధాన మంత్రి అవ్వడం తమకెంతో ఆనందంగా ఉందని చెబుతున్నారుఅక్కడి ప్రజలు . ఐదేళ్లలో వారణాసిలో చాలా అభివృద్ధి పనులు జరిగాయన్న స్థానికులు రానున్న ఐదేళ్లు కూడా మోదీ ఇలాగే అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రధాన పూజారి ఆచార్య అశోక్ ద్వివేదీ, ఇవాళ మోదీ తరపున పూజ చెయ్యబోతున్నారు. 2014లో కూడా విజయం తర్వాత మోదీ ఇక్కడ పూజలు చేశారు. ఉదయం 10 గంటలకు మోదీ ఆలయ దర్శనానికి వెళ్తారనిసమాచారం .ఆలయ దర్శనానంతరం మోదీ... దీన్ దయాళ్ హస్తకళా సంకుల్లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక ఈనెల 30 న మోదీ మరోమారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు.