రసవత్తరంగా మధ్యప్రదేశ్ రాజకీయం : సా.5 గంటల వరకు ‘సుప్రీం’ డెడ్లైన్, స్పందించని స్పీకర్, బలపరీక్ష..?
మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం నేటితో తెరపడబోతుందా..? సుప్రీంకోర్టు ఆదేశాలతో అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించబోతున్నారా..? శివరాజ్సింగ్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మేరకు శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష నిర్వహించాలి.. కానీ మధ్యప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నెల 26వ తేదీకి వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో సభను నిర్వహించబోతున్నామని మధ్యప్రదేశ్ అసెంబ్లీ మాత్రం ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఇవాళ బలపరీక్ష ఉంటుందా..? లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్, బీజేపీ మాత్రం తమ ఎమ్మెల్యేలకు విప్ జారీచేశాయి.
సంక్షోభం ఇలా...?
జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు ఎగరవేయడంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనిశ్చితి నెలకొంది. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. బెంగళూరు హోటల్లో మకాం వేశారు. వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హోటల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విఫల ప్రయత్నం చేశారు. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ప్రభుత్వానికి మెజార్టీ లేదని శివరాజ్సింగ్ వేసిన పిటిషన్పై గురువారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపి.. శుక్రవారం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని కమల్నాథ్ ప్రభుత్వానికి స్పష్టంచేసింది.
రాజీనామాల ఆమోదం..
బలపరీక్ష కోసం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన వెంటనే.. స్పీకర్ ప్రజాపతి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ రెబల్ 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించిన సంగతి తెలిసిందే. దీంతో రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించిన సంఖ్య 16కి చేరింది. స్పీకర్ ప్రజాపతి నిర్ణయంతో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే విపక్ష బీజేపీకే మేలు కలగనుంది. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించడంతో అసెంబ్లీలో బలం పడిపోతోంది. దీంతో ప్రస్తుత సంఖ్య ఆధారంగా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది.
Recommended Video
బీజేపీకే మేలు...?
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 228 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 114 సభ్యులతో అధికారం చేపట్టింది. 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఆ పార్టీ బలం 98కి చేరుకుంటుంది. దీంతో సభలో సభ్యుల సంఖ్య కూడా 212కి చేరుకుంటోంది. మెజార్టీ మార్క్ 107కి చేరగా.. బీజేపీకి సొంతంగానే 109 సభ్యుల బలం ఉంది. ఇండిపెండెంట్ల మద్దతు తీసుకుంటే ఆ సంఖ్య మరింత పెరగనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారం బీజేపీకి మారనుంది. స్పీకర్ ప్రజాపతి రెబల్ ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదించకున్న బీజేపీకి మేలు జరగనుంది. ఆ పార్టీ నేతలు క్యాంప్లో ఉండటంతో ఆ రోజు హాజరయ్యే వారి సంఖ్య తగ్గి.. కమల్నాథ్ ప్రభుత్వం కుప్పకూలిపోతోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం స్పీకర్ ప్రజాపతి బలపరీక్ష నిర్వహిస్తారా లేదా అనే అంశంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది.