7రాష్ట్రాల్లో ముగిసిన రాజ్యసభ ఎన్నికలు: టీలో బీజేపీ దూరం
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 25 సీట్లకోసం యూపీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కేరళల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు పూర్తయిన గంట తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఇందులో పదిసీట్లు ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నాయి.
శుక్రవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సాగింది. యూపీలో 10 సీట్లకు ఎన్నికలు జరగనుండగా బీజేపీ 8, ఎస్పీ ఒక స్థానంలో సులభంగా గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే పదో స్థానం కోసం బీజేపీ అదనంగా బరిలో దించిన అభ్యర్థికి, బీఎస్పీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
ఎస్పీ వద్ద అదనంగా ఉన్న ఎమ్మెల్యేల మద్దతుతో బీఎస్పీ గెలుస్తుందని భావించినా.. ఇండిపెండెంట్లతోపాటు ఎస్పీలోని శివ్పాల్ వర్గం ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు బరిలో ఉన్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో 58 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవగా.. నాలుగు రాష్ట్రాల్లోని 33 సీట్లు ఏకగ్రీవం కావటంతో మిగిలిన 25 సీట్లకే శుక్రవారం ఎన్నికలు జరిగాయి.
#Visuals from Telangana assembly ahead of voting for three #RajyaSabha seats from the state pic.twitter.com/Uh3atyBHil
— ANI (@ANI) March 23, 2018