ఇక జోరుగా కల్లు అమ్మకాలు: 13 నుంచి గేట్లు ఎత్తేయడానికి సర్కార్ రెడీ: గీత కార్మికుల సంక్షేమానికి..
తిరువనంతపురం: కరోనా వైరస్ విస్తరించడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడోదశ లాక్డౌన్ కొనసాగుతోంది. ఇదివరకు రెండుదశల్లో కొనసాగిన లాక్డౌన్ సమయాల్లో లేని సడలింపులను ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆంక్షలతో కూడిన నిబంధనలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిచ్చింది. ఫలితంగా- దాదాపు అన్ని రాష్ట్రల్లోనూ మద్యం షాపులు తెరచుకున్నాయి. వాటితో పాటు గ్రామీణ స్థాయిలో నిత్యావసర దుకాణాలు, మార్కెట్లను ఓపెన్ అయ్యాయి.
Recommended Video
హైదరాబాద్ నుంచి తరలివెళ్తూ: వలస కార్మికుల దుర్మరణం: మామిడిపండ్ల లోడుతో వెళ్తోన్న లారీ బోల్తా
మద్యం విక్రయాలు జోరుగా సాగిన.. కేరళలో బ్రేక్
దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఊపందుకున్న వేళ.. కేరళలో మాత్రం వాటికి బ్రేక్ పడింది. మద్యం అమ్మకాలను ఇంకా ఆరంభించలేదు అక్కడి ప్రభుత్వం. మద్యం దుకాణాలను తెరవడం వల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చినప్పటికీ.. కరోనా వైరస్ నియంత్రణ చర్యలు కట్టుతప్పే అవకాశం లేదని భావిస్తోంది. దీనితో ఇతర రాష్ట్రాల తరహాలో అక్కడ మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగట్లేదు. పరిమితంగానే ఉంటున్నాయి.
కల్లు విక్రయాలకు గేట్లు ఎత్తేయడానికి రెడీ..
అదే సమయంలో- కల్లు విక్రయాలకు గేట్లు ఎత్తేయడానికి కేరళ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కల్లు దుకాణాలను తెరవడానికి అవసరమైన ఆదేశాలను ఇప్పటికే జారీ చేసింది. కల్లు దుకాణాల సంఖ్యపై ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న అన్ని కల్లు దుకాణాలను తెరవడానికి వెసలుబాటును కల్పించింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, మాస్క్లను ధరించడం మాత్రం తప్పనిసరి చేసింది.
మద్యం దుకాణాల వద్ద రద్దీ.. గీత కార్మికుల సంక్షేమం..
మద్యం అమ్మకాల కంటే కల్లు విక్రయాల వైపే కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం మొగ్గు చూపడానికి కారణాలు లేకపోలేదు. దేశవ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద చోటు చేసుకున్న జనసమ్మర్థం, కల్లు గీత కార్మికుల సంక్షేమం.. వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుంది. దక్షిణాది రాష్ట్రాలతొో పోల్చుకుంటే కేరళలో కల్లు అమ్మకాలు అత్యధికం. కల్లు అమ్మకాల మీద ఆధారపడి జీవించే కుటుంబాల సంఖ్యా ఎక్కువే.
వేలాది కుటుంబాల ఉపాధి కోసం..
లాక్డౌన్ వల్ల వేలాదిగా గీత కార్మికుల కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. నెలన్నర రోజులుగా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి. గీత కార్మికుల కుటుంబాలకు జీవనోపాధిని కల్పించడంలో భాగంగా.. కల్లు విక్రయాలకు ప్రాధాన్యత ఇచ్చింది అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం. ప్రస్తుతం కేరళ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న కల్లు దుకాణాలను తెరవడానికి అనుమతి ఇచ్చింది. దీని తరువాతే.. మద్యం అమ్మకాల పునరుద్ధరణపై దృష్టా సారిస్తామని కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు.