'మా మరుగుదొడ్లు చోరీకి గురయ్యాయి, వెతికి పెట్టండి'
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి విచిత్రమైన కేసు పెట్టింది. తమ రెండిళ్లల్లోని మరుగుదొడ్లను ఎవరో ఎత్తుకెళ్లారని, వెంటనే వెతికి పెట్టి, ఆ దొంగలను శిక్షించాలని
బిలాస్పూర్: ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి విచిత్రమైన కేసు పెట్టింది. తమ రెండిళ్లల్లోని మరుగుదొడ్లను ఎవరో ఎత్తుకెళ్లారని, వెంటనే వెతికి పెట్టి, ఆ దొంగలను శిక్షించాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
అమర్పూర్ గ్రామానికి చెందిన బేలాబాయ్ పటేల్, ఆమె కుమార్తె చందా కొన్నేళ్ల క్రితమే భర్తలను కోల్పోయారు. వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్న ఈ మహిళలు స్వచ్ఛభారత్ అభియాన్ కింద మరుగు దొడ్లు నిర్మించుకునేందుకు 2015-16లో గ్రామపంచాయతీకి దరఖాస్తు చేసుకున్నారు.
ఈ దరఖాస్తులను పెంద్రాలోని జన్పద్ పంచాయతీకి బదిలీ చేయగా అక్కడ మరుగుదొడ్డి నిర్మాణానికి అనుమతి లభించింది. అయితే ఏడాది గడుస్తున్నా నిర్మాణం మాత్రం చేపట్టలేదు. దీంతో దరఖాస్తు పరిస్థితి తెలుసుకునేందుకు బేలా, ఆమె కుమార్తె జన్పద్ పంచాయతీకి వెళ్లారు.
అధికారులు చెప్పింది విని వారు కంగు తిన్నారు. సదరు దరఖాస్తుల కింద టాయిలెట్ నిర్మాణం ఎప్పుడో పూర్తయిందని పంచాయతీ అధికారులు చెప్పారు.
గ్రామంలో మరుగుదొడ్డి కోసం దాఖలు చేసుకున్న వారందరికీ నిర్మాణాలు జరిగాయని సహ చట్టం ద్వారా వెలుగు చూసింది. నిధులు కూడా విడుదలయ్యాయని తేలింది. దీంతో ఆ మహిళ తమ మరుగుదొడ్లు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేసారు.