సహనశీలత భారత్ ఆత్మలోనే ఉంది: నఖ్వీ
న్యూఢిల్లీ: సహనశీలత భారత దేశ ఆత్మలోనే ఉందని, సామరస్యం దేశ బలమని కేంద్ర మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. కేవలం రాజకీయాల కోసం వీటిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దేశంలో సహనశీలత కొరవడుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో దాన్ని ఆయన ఖండించారు. దేశం సహనశీలతకు మారుపేరని, అది లేదనడం సిగ్గుచేటంటూ కాంగ్రెస్ విమర్శల్ని ఇతర కేంద్ర మంత్రులు కూడా ఖండించారు.
దేశంలో అసహనం ఎక్కుడుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించగా, కొన్ని రాజకీయా పార్టీలు కావాలనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా అన్నారు.
బాధిస్తున్నాయి: అసహనంపై మన్మోహన్ సింగ్
దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం ద్వారా సామాజిక ఆర్థికాభివృద్ధికి అవరోధం కలిగిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి సందర్భంగా శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
మతం వ్యక్తిగత అంశమని, అందులో రాజ్యం సహ ఎవరూ జోక్యం చేసుకోలేరని ఆయన స్పష్టం చేశారు. మతాన్ని ఆధారంగా చేసుకుని విధాన నిర్ణయాలు రూపొందించుకోకూడదని ఆయన అన్నారు.
ఇటీవలి విషాదకర సంఘటనలు బాధిస్తున్నాయని, భావప్రకటనా స్వేచ్ఛను, మత విశ్వాసాలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని మన్మోహన్సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు న్యాయసమ్మతం కాదని మన్మోహన్ అన్నారు.