ఢిల్లీ అల్లర్లు: 42కు పెరిగిన మరణాలు.. విడతలవారీగా 144 సడలింపు.. శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతం..
అల్లర్లు, హింసతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాల మోహరింపు తర్వాత గొడవలు పూర్తిగా సర్దుమణిగాయి. అయితే గాయపడి ఆస్పత్రుల్లో చేరినవాళ్లు వరుసగా చనిపోతుండటంతో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి ఢిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య 42కు పెరిగింది. చికిత్స పొందుతున్నవారిలో చాలా మంది పరిస్థితి విషమంగానే ఉండటంతో మరణాలు ఇంకా పెరిగే అవకాశముంది.
ఢిల్లీ అల్లర్లు: ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఫ్యాక్టరీ సీజ్ చేసిన పోలీసులు
జీటీబీలో మృత్యుఘోష..
ఢిల్లీ అల్లర్లలో గాయపడ్డవాళ్లలో ఎక్కువ మంది గురు తేగ్ బహదూర్(జీటీబీ) ఆస్పత్రిలోనే చేరడంతో మరణాల సంఖ్య కూడా అక్కడే ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు జీటీబీలో 38 మంది మరణించగా, లోక్ నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో ముగ్గురు, జేపీ చందా ఆస్పత్రిలో ఒకరు కన్నుమూశారని అధికారులు వెల్లడించారు. తమవాళ్ల మృతదేహాలను తీసుకెళ్లేందుకు వచ్చిన బందువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదకర వాతావరణం నెలకొంది. తప్పిపోయిన కుటుంబీకుల జాడ కోసం ఇంకొందరు ఆస్పత్రుల చుట్టూ పడిగాపులు కాస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.
సెక్షన్ 144 సడలింపు.. ఎన్జీవోల సాయం
అల్లర్ల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు సెక్షన్ 144 విధించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారానికి పరిస్థితులు అదుపులోకి రావడంతో విడతలవారీగా కర్ఫ్యూ ఎత్తేశారు. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. రాత్రి కూడా కొంత సమయం సడలించే అవకాశముంది. ఈశాన్య ఢిల్లీలో చాలా చోట్ల దుకాణాలు తగలబడిపోవడంతో నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వందల సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలు ఆహారం, నిత్యావసరాలు ప్రజలకు చేరవేశాయి.
Recommended Video
ప్రార్థనలు ప్రశాంతం.. కొత్త సీపీ భరోసా
ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్, మౌజ్పూర్, ఘోండా, చాంద్బాగ్, బాబర్పూర్, గోఖుల్పూరి, యమునా విహార్, భజన్పుర తదితర ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడిక్కడ పోలీసులు, కేంద్ర బలగాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హింసను అరికట్టేందుకు మూడ్రోజుల కిందట ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉందని, ప్రజలు దేనికీ భయపడొద్దని సీపీ భరోసా ఇచ్చారు.