Tollywood: నిర్భయ తల్లితో పూనమ్ కౌర్: ఓ చిన్న ట్రీట్: భుజంపై చేతులు వేసి, ఆప్యాయంగా..!
న్యూఢిల్లీ: తనదైన శైలిలో పదునైన కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కే టాలీవుడ్ నటి..పూనమ్ కౌర్. మరోసారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు. కారణం- నిర్భయ తల్లి ఆశాదేవిని కలవడమే. దేశ రాజధానిలో అత్యాచారానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన నిర్భయ తల్లి ఆశాదేవిని పూనమ్ కౌర్ కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఆమెకు ఓ రెస్టారెంట్ లో ఓ చిన్న ట్రీట్ కూడా ఇచ్చారు.
నిర్భయ దోషులకు ఉరితాళ్లు సిద్ధమవుతున్నాయి?: ఎక్కడో తెలుసా?
16వ తేదీ కోసం వెయిటింగ్..
ఆశాదేవి భుజాలపై ఆప్యాయంగా చేతులు వేసిన ఓ ఫొటోను పూనమ్ కౌర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ నెల 16వ తేదీ కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. ఆశాదేవి కుమార్తె నిర్భయ మరణానికి కారణమైన నలుగురు దోషులను ఈ నెల 16వ తేదీన ఉరి తీసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. బిహార్ లోని బక్సర్ కేంద్ర కారాగారంలో వారిని ఉరి తీయవచ్చంటూ జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
16వ తేదీన ఖాయమేనా?
2012 డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధానిలో నిర్భయపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్ సహా రామ్ సింగ్, మరో మైనర్ నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మైనర్ కు తప్ప అందరికీ ఉరి శిక్ష పడింది. రామ్ సింగ్ ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం నయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్ జీవించి ఉన్నారు. వారికి 16వ తేదీన తెల్లవారు జామున 5 గంటలకు ఉరిశిక్ష పడే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
ట్రీట్.. అందుకే
నిర్భయ మరణానికి కారణమైన వారిని ఉరి తీయడం ఖాయమైనందునే పూనమ్ కౌర్.. ఆశాదేవికి ట్రీట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉరి తీసే సందర్భాన్ని తాను ఆస్వాదిస్తానని ఆమె పేర్కొంటున్నారు. ఈ సందర్భాన్ని తాను నిర్భయ తల్లితో సెలబ్రేట్ చేసుకుంటున్నానని అన్నారు. దేశ ప్రజలందరూ నిర్భయ మరణానికి కారణమైన వారిని ఉరి తీసే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, తన పరిస్థితీ అలాగే ఉందని చెప్పారు.