టూల్కిట్ కేసు: శంతను ములుక్కు బాంబే హైకోర్టు నుంచి ట్రాన్సిట్ బెయిల్, నికితా జాకబ్ ప్లీ రిజర్వ్
ముంబై: పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ 'టూల్ కిట్' కేసు దర్యాప్తులో భాగంగా నికితా జాకబ్, శంతను ములక్లపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసందే. ఈ క్రమంలో శంతను ములుక్కు మంగళవారం బొంబాయి హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం పది రోజుల ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది.
ఇక మరో సామాజిక కార్యకర్త నికితా జాకబ్ బెయిల్ పిటిషన్పై బుధవారం విచారణ జరగనుంది. ప్రస్తుతం జాకబ్ అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గ్రెటా థన్ బర్గ్ చేసిన 'టూల్కిట్' ట్వీట్ వ్యవహారంంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై నికితా జాకబ్, శంతను ములుక్లపై ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. వీరిద్దరూ పరారీలో ఉన్నారని ఢిల్లీ పోలీసులు పేర్కొనడంతో ముందస్తు బెయిల్ కోసం బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు.
కాగా, బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవిని ఈ టూల్ కిట్ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రెటా థన్ బర్గ్ ట్విట్టర్లో ఈ టూల్ కిట్ ను షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ టూల్ కిట్ను థన్బర్గ్కు దిశనే పంపించడం గమనార్హం. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా వివిధ రూపాల్లో ఆందోళనలను చేపట్టాలని సూచిస్తూ ఈ గూగుల్ టూల్ కిట్ ను రూపొందించారు. ఇందులో దిశతోపాటు నికిత, శంతనుల పాత్ర కూడా ఉండటంతో వారిపైనా కేసు నమోదు చేశారు.