టూల్కిట్ కేసు: మరో 3 రోజులపాటు దిశ రవి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: స్వీడన్ పర్యావరణవేత్త గ్రెటా థన్బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన 'టూల్కిట్' కేసులో అరెస్టైన దిశ రవికి మరో మూడు రోజులపాటు జ్యూడీషియల్ కస్టడీని పొడిగిస్తూ పటియాలా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం దిశ రవిని కోర్టులో హాజరుపర్చిన ఢిల్లీ పోలీసులు మరో మూడు రోజులపాటు ఆమె కస్టడీని కోరారు.
ఫిబ్రవరి 22న ఈ కేసులో సహ నిందితుడైన శంతను ములుక్తో కలిపి విచారణ చేసేందుకు కస్టడీని పొడిగించాల్సిందిగా పోలీసుల తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విన్నవించారు. టూల్కిట్ను రూపొందించడంలో పర్యావరణ కార్యకర్త దిశ రవితోపాటు నికిత జాకబ్, శంతనుములుక్లు భాగస్వాములని ఢిల్లీ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నికిత, శంతను ట్రాన్సిట్ బెయిల్పై ఉన్నారు.
టూల్కిట్ కేసులో ఢిల్లీ హైకోర్టు పోలీసులు మీడియాకు కీలక సూచనలు
పర్యావరణ కార్యకర్త దిశ రవి అరెస్ట్, టూల్ కిట్ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలకు సంబంధించిన 'టూల్కిట్' వ్యవహారంలో అరెస్టైన దిశ రవికి సంబంధించిన ఎఫ్ఐఆర్, ఇతర దర్యాప్తునకు సంబంధించి లీకైన వివరాలను ప్రచురించొద్దని మీడియాను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
ఆ సమాచారాన్ని అధికారిక వర్గాల నుంచి ధృవీకరించుకుని, దాని వల్ల దర్యాప్తునకు ఎలాంటి అవరోధం కలగదని నిర్ధారించుకున్న తర్వాతే ప్రచురించాలని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించడం వల్ల దర్యాప్తునకు ఆటంకాలు కలగవచ్చని అభిప్రాయపడింది. తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు సంబంధించి ఎలాంటి దర్యాప్తు సమాచారాన్ని మీడియాకు లీక్ చేయకుండా చూడాలంటూ దిశ రవి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ప్రతిభా సింగ్ ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారించింది.
అయితే, ఇప్పటి వరకు ప్రచురితమైన వార్తల్ని, పోలీసులు చేసిన ట్వీట్లు తొలగించేలా ఆదేశాలివ్వాలన్న పిటిషనర్ అభ్యన్థనను మాత్రం ధర్మాసనం పరిగణిలోకి తీసుకోలేదు. ఈ సందర్భంగా కొన్ని మీడియా సంస్థలపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసుకు సంబంధించి గతంలో ప్రచురించిన కొన్ని వార్తలు సంచలనాత్మకంగా, పక్షపాతపూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. మీడియాతోపాటు ఢిల్లీ పోలీసులకు కూడా హైకోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది. మీడియాకు సమాచారాన్ని లీక్ చేయలేదంటూ దాఖలు చేసిన ప్రమాణపత్రానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తుపై చట్టానికి లోబడి, నిబంధనల ప్రకారం మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.