ToolKit కేసు: దిశ రవి అరెస్టు తర్వాత నికితా జాకబ్కు నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్
దేశంలో జరుగుతున్న రైతు నిరసనలకు మద్దతుగా నిలుస్తూ కార్యచరణ విడుదల చేసింది స్వీడెన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్. ఈ ప్రణాళికను టూల్ కిట్ పేరుతో షేర్ చేసింది. ఇప్పుడు భారత్లో టూల్ కిట్ కేసు హాట్టాపిక్గ్గా మారింది. టూల్ కిట్ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవి అరెస్టు అయిన కొద్ది గంటల్లోనే మరో ఉద్యమకారిణి మరియు లాయర్ నికితా జాకబ్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఢిల్లీ కోర్టు. టూల్ కిట్ కేసులో నికితా జాకబ్ పాత్ర కూడా ఉందని కోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు... ఆమెను విచారణ చేసేందుకు అనుమతించాలని కోర్టును కోరడంతో నాన్బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. అంతకుముందు శనివారం రోజున పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవిని ఢిల్లీ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు.
ఇదిలా ఉంటే నికితా జాకోబ్ తప్పించుకుని తిరుగుతున్నందునే ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తికి మేరకు నాన్బెయిలబుల్ వారెంట్ను జారీ చేసినట్లు ఢిల్లీ కోర్టు పేర్కొంది. ఫిబ్రవరి 11వ తేదీన నికితా జాకబ్ ఇంటిని సోదా చేసేందుకు ఢిల్లీ పోలీసులు వెళ్లారని ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ వెల్లడించింది. అయితే పోలీసు అధికారులు సాయంత్రం వేళ ఇంటికి వెళ్లడంతో ఆమెను ప్రశ్నించేందుకు వీలుపడలేదని పేర్కొన్నారు. అయితే విచారణకు హాజరవుతుందని తెలిపే కొన్ని డాక్యుమెంట్ల పైన నికాతా జాకబ్ సంతకం చేశారని గుర్తు చేసిన పోలీసులు ఆ తర్వాత ఆమె విచారణకు హాజరు కాలేదని... అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆమెపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సిందిగా కోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
ఇక దిశ రవి అరెస్టు అక్రమం అని పలువురు ప్రముఖులు ఆమెకు అండగా నిలిచారు. దిశ రవికి ఎలాంటి న్యాయపరమైన సహకారం అందించకుండా రిమాండ్కు ఎలా తరలిస్తారని పలువురు న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి దిశను తరలించేముందు బెంగళూరు కోర్టులనుంచి ఢిల్లీ పోలీసులు ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుందని, కానీ ఆపని చేయకుండా నిబంధనలను ఉల్లంఘించారని చెబుతున్నారు. ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు దిశ రవికి న్యాయపరమైన సహకారం అందించడంలో మెజిస్ట్రేట్ విఫలమయ్యారని రెబకా జాన్ అనే న్యాయవాది ఓ పోస్టు ద్వారా తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 కచ్చితంగా అనుసరించాల్సిన బాధ్యత అమలు చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుందని ఆమె గుర్తు చేశారు.
దిశ రవిని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు వాదనల సమయంలో ఆమెకు న్యాయపరమైన సహకారం అందించేందుకు ఎవరూ ముందుకు రాకపోయి ఉంటే... ఆమె న్యాయవాది వచ్చే వరకు అయిన మెజిస్ట్రేట్ వేచి చూసి ఉంటే బాగుండేదని లాయర్ జాన్ అభిప్రాయపడ్డారు.