కేజ్రీకి షాక్, 'గాంధీ' రూపంలో మరో పిడుగు: ఉన్నది చెప్పేందుకు భయపడను
న్యూఢిల్లీ: యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లపై వేటు అనంతరం.. ఆమ్ ఆద్మీ పార్టీలో మరో బాంబు పేలింది! ఏఏపీకి చెందిన సీనియర్ నేత మయాంక్ గాంధీ పెదవి విప్పారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నుంచి యోగేంద్ర, ప్రశాంత్లను తొలగించిన పద్ధతిని బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. తద్వారా ఆయన పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించారు.
వీరిద్దరి తొలగింపు కోసం జరిగిన జాతీయ కార్యవర్గం భేటీ వివరాలను బయటకు చెప్పొదన్న నాయకత్వం ఆదేశించింది. దానిని ఆయన బేఖాతరు చేశారు. క్రమశిక్షణ చర్యను ఎదుర్కొనేందుకైనా సిద్ధమని కానీ, ఆ ఇద్దరు నేతలను తొలగించిన తీరుపై తన అసంతృప్తిని వెల్లడించి తీరుతానని చెప్పారు.
తాను భయపడనని, భగవంతుడికి తప్ప దేనికీ నేను తల వంచనని చెప్పారు. బుధవారం జరిగిన కీలక జాతీయ కార్యవర్గ సమావేశానికి మయాంక్ గైర్హాజయ్యారు. వారికి వారు పీఏసీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమైనప్పుడు గెంటేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
గత రాత్రి పార్టీ నాయకులు తనను సంప్రదించారని, సమావేశ విషయాలను బయటపెడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారన్నారు. ఇప్పుడే కాదు ఎన్నికల సమయం నుంచీ ఆ ఇద్దరు నేతలకూ, అరవింద్కూ మధ్య విభేదాలు ఉన్నాయని బాంబు పేల్చారు.
అభ్యర్థులను ఎంపిక చేసిన పద్ధతి ప్రశాంత్కు నచ్చలేదని, ఈ విషయం మీడియాను పిలిచి చెబుతానని ఆయన చాలాసార్లు బెదిరించారని, యోగేంద్ర యాదవ్ విషయానికి వస్తే ఆయన అరవింద్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నట్టు పార్టీకి బలమైన అనుమానాలు ఉన్నాయని, బలమైన ఆధారాలు కొన్నింటిని పార్టీ బయటపెట్టిందని చెప్పారు.
పార్టీని నడిపించడంలో వారికీ, కేజ్రీవాల్కు పొసగే పరిస్థితి లేదన్నారు. వారిద్దరు పీఏసీలో ఉంటే తాను కన్వీనర్గా కొనసాగలేనని కేజ్రీవాల్ చెప్పడం వల్లనే జాతీయ కార్యవర్గం సమావేశం కావాల్సి వచ్చిందన్నారు. జాతీయ కార్యవర్గంలో యోగేంద్ర రెండు ప్రతిపాదనలు చేశారన్నారు.
పీఏసీని పునర్వ్యవస్థీకరించి, ఎన్నికలు జరపాలని, ఆ ఎన్నికల్లో యోగేంద్ర, ప్రశాంత్ పాల్గొనరు, అది మొదటి ప్రతిపాదన కాగా, రెండోది ఇప్పటిలాగే పీఏసీ కొనసాగుతుంది.
అయితే, వీరిద్దరు సమావేశాలకు దూరంగా ఉంటారని, దాన్నిబట్టి వారు వైదొలడానికి సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోందని,అలాంటప్పుడు తీర్మానం చేసి, ఓటింగ్ జరపాల్సిన పని లేదని, దీనివెనక నాయకత్వం ఉద్దేశ్యం, వారి ధోరణి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఎండగట్టారు. జాతీయ కార్యవర్గంలో ఎలాంటి వ్యవహారాలు నడవలేదని యోగేంద్ర యాదవ్ తెలిపారు.
ఏఏపీలో తలెత్తిన అంతర్గత కుమ్ములాటలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు గుప్పించాయి. తాజా పరిణామాలు పరిశీలిస్తే మిగతా పార్టీలకు ఏఏపీకి పెద్ద తేడా లేదని తెలుస్తోందన్నారు. ఆ పార్టీకి దశ దిశలేదన్నారు. ఒక వ్యక్తిచుట్టూ అధికారం కేంద్రీకృతమై ఉంటే ఇలానే ఉంటుందని స్పష్టం చేశారు.
ఏక వ్యక్తి పార్టీలు, ప్రాంతీయ పార్టీలను ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు, ముఠాతగాదాలు చుట్టుముడతాని బీజేపీ వ్యాఖ్యానించింది. వ్యాఖ్యానించింది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్లకు ఏఏపీకి తేడా లేదన్నారు. రాజకీయాల్లో కొత్త వొరవడి సృష్టిస్తామని ఏఏపీ అధికారంలోకి వచ్చిందని, రాజకీయాలకు కొత్త భాష్యం అంటే ఇదేనా? అని ఎద్దేవా చేశారు.
బీజేపీ నేత షాజియా ఇల్మి మాట్లాడుతూ ఇదంతా కేజ్రీవాల్ ఆడుతున్న నాటకంగా పేర్కొన్నారు. కథ రాసింది కేజ్రీవాల్, నడిపిస్తున్నది ఆయనే అంటూ షాజియా ఇల్మీ విరుచుకుపడ్డారు. ఈ మొత్తం వ్యవహారానికి దర్శక, నిర్మాత కేజ్రీవాలే అన్నారు. బలమైన రాజ్యాంగం లేదని, అందుకే అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయని, అక్కడ నుంచి అధికార కుమ్ములాటలకు దారి తీసిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కాదని, అరవింద్ ఆద్మీ పార్టీ అని బీజేపీ ఎద్దేవా చేసింది.
186 కోట్ల నీటి సర్చార్జి రద్దు
ఢిల్లీలో నల్లాలున్న గృహవినియోగదారులకు ఏఏపీ సర్కారు హోలీ కానుక ప్రకటించింది. నల్లా బిల్లులు చెల్లింపులో జాప్యానికి సంబంధించిన సర్చార్జి నుంచి ఊరట కల్పించింది. సర్చార్జి మొత్తం రూ.186 కోట్లను రద్దు చేయాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. ఢిల్లీ జల బోర్డు(డీజేబీ) చైర్మన్ కూడా అయిన సిసోడియా ఈ మేరకు ఆదేశాలిచ్చారు.