టాప్ హిజ్బుల్ కమాండర్ మసూద్ అలియాస్ రహీ మృతి: మరో ఇద్దరు కూడా..
భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో హిజ్బుల్ టాప్ కమాండర్ మసూద్ అలియాస్ రహి చనిపోయాడు. జమ్ముకశ్మీన్లో జరిపిన కాల్పుల్లో రహి సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని పోలీసులు తెలిపారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు చనిపోవడంతో దోడ జిల్లా ఉగ్రవాద రహిత జిల్లాగా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.
అనంత్ నాగ్ ఖుల్ చోహర్ వద్ద భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రహీ, జిల్లా కమాండర్ సహా మరొకరు చనిపోయారని జమ్ముకశ్మీర్ డీజీపీ దలిబాగ్ సింగ్ తెలిపారు.
చనిపోయిన ఉగ్రవాది రహీ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. 2018లో భారీగా ఆయుధాలను కూడా ఎత్తుకెళ్లాడు. దోడా జిల్లాలో మైనర్ బాలికపై లైంగికదాడి చేశాడు. రహీ హిజ్బుల్ ముజాహిద్దీన్లో చేరాక.. దోడా నుంచి మకాం కశ్మీర్కు మార్చాడు.
అతని సోదరుడు ఫరూఖ్ అహ్మద్ 1999 నుంచి పాకిస్తాన్లో ఉగ్రవాదిగా ఉన్నాడు. జూన్లో అత్యధికంగా 46 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటిరకు 116 మంది ఉగ్రవాదులు చనిపోయారు.