పెద్ద తలను లేపేశారు.. ఇంకో నలుగురు కూడా.. ఇండియాను మళ్లీ కెలుకుతోన్న అమెరికా..
దాయాది పాకిస్తాన్ మద్దతుతో జమ్మూకాశ్మీర్ లో విధ్వంసం సృష్టించాలనుకున్న టెర్రరిస్టుల ప్రయత్నాన్ని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. జమ్మూకశ్మీర్లో సరిహద్దుకు దగ్గరగా ఉండే పుల్వామా జిల్లాలోని త్రాల్ సెక్టార్ లో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది. అందులో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ హమ్మద్ ఖాన్ తోపాటు ఇంకో టెర్రరిస్టును భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇంట్లోనే దాక్కుని కాల్పులు జరుపుతోన్న మరో ముగ్గురు ముష్కరుల్ని కూడా బలగాలు చుట్టుముట్టాయి.
భీకర కాల్పులు
పుల్వామాలో కలకలం రేపేందుకు ఐదుగురు ఉగ్రవాదుల టీమ్ స్కెచ్ వేసింది. వీళ్లంతా త్రాల్ ఏరియాలోని ఓ రెసిడెన్షియల్ క్లాంపెక్స్ లో దాక్కున్నట్లు ఇంటెలిజెన్స్ ద్వారా భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. ఆదివారం తెల్లవారుజామునే ఆ ఏరియాను చుట్టుముట్టిన బలగాలు.. ముందు జాగ్రత్త చర్యగా స్థానికుల్ని అక్కణ్నుంచి బయటికి తీసుకొచ్చేశారు. బలగాల రాకను గమనించిన టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో ఇటు నుంచి కూడా ఎదురుదాడి జరిగింది.
ఇంకో ముగ్గురు
ఐదుగురు టెర్రరిస్టుల్లో ఇద్దరు హతమయ్యారని, వారిలో హిజ్బుల్ టాప్ కమాండర్ హమ్మద్ కూడా ఉన్నాడని, ఇంట్లోనే నక్కిన ఇంకో ముగ్గురు టెర్రరిస్టులు కూడా దాదాపు చేతికి చిక్కినట్లేనని అధికారులు చెప్పారు. షోపియాన్ జిల్లాలో చోటుచేసుకున్న మరో సంఘటనలో.. ఓ టెర్రరిస్టు స్థావరాన్ని గుర్తించిన సెక్యూరిటీ బలగాలు.. అందులోని దుప్పట్లు, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
అమెరికా ఆందోళన..
జమ్మూకాశ్మీర్ వ్యవహారంలో ప్రపంచ పెద్దన్న అమెరికా మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించింది. కాశ్మీర్ లో రాజకీయ నేతల నిర్బంధం కొనసాగింపు, ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఆందోళన చెందుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రటన చేసింది. ఇండియాలో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ ఇటీవల కాశ్మీర్ లో పర్యటించడాన్ని కీలక అంశంగా పరిగణిస్తున్నామని, కాశ్మీర్ లో ఆంక్షల కొనసాగింపుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోందని, త్వరలోనే పరిస్థితి సాధారణ స్థాయికి రావాలని కోరుకుంటున్నట్లు యూఎస్ విదేశాంగ శాఖ సౌత్, సెంట్రల్ ఏషియా వ్యవహారాల బాధ్యురాలు ఆలెస్ వేల్స్ అన్నారు.