నాకంతా తెలుసు! కానీ నేనేం చేయలేదు! ఎన్ఐఏ విచారణలో జైషే కమాండర్ వెల్లడి
ఢిల్లీ : పుల్వామా దాడికి సంబంధించి సంచలన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎన్ఐఏ అదుపులో ఉన్న జైషే మహమ్మద్ కమాండర్ నిసార్ అహ్మద్ తాంత్రే కీలక విషయాలు బయటపెట్టాడు. పుల్వామా దాడి గురించి తనకు ముందే తెలుసని, ఉగ్రదాడికి సూత్రధారైన ముదస్సిర్ ఖాన్ తనకు ఆ విషయం ముందే చెప్పాడని అన్నాడు. జైషే మహమ్మద్ సంస్థ సూచనల మేరకే పుల్వామా దాడి జరిగిందని ధ్రువీకరించాడు.
పాక్ పై మరో దాడికి భారత్ ప్లాన్ చేసింది: పాక్ మంత్రి సంచలన ఆరోపణ
ఎన్ఐఏ ఇంటరాగేషన్లో నిసార్ అహ్మద్ తాంత్రే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. దాడి సూత్రధారి ఖాన్ సోషల్ మీడియా యాప్ ఉపయోగించి తనకు కాల్ చేశాడని, ఫిబ్రవరి మధ్యలో ప్లాన్ అమలు చేయనున్నట్లు చెప్పాడని అధికారులకు వివరించాడు. దాడికి సాయం చేయమని కోరాడని ఈ వ్యవహారమంతా జైషే సంస్థ ఆదేశాల మేరకే జరిగిందని స్పష్టం చేశాడు.
కాశ్మీర్లో తీవ్రవాద దాడులు చేయడంలో నిసార్ అహ్మద్ది కీలక పాత్ర. ఇతని ఆధ్వర్యంలోనే 2017 డిసెంబర్ 30న లెథపోరాలో సీఆర్పీఎఫ్ క్యాంప్పై దాడి జరిగినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఫిబ్రవరి 1న తాంత్రే యూఏఈకి ఎందుకు పారిపోయాడు. జైషే కమాండర్ నూర్ తాంత్రే తమ్ముడైన నిసార్ను మార్చి 31న ఎన్ఐఏ అధికారులు భారత్కు తీసుకువచ్చారు. ప్రస్తుతం పుల్వామా దాడికి ముందు తాంత్రే యూఏఈకి ఎందుకు పారిపోయాడన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.