లష్కరే టాప్ కమాండర్ అబూ కాసిం కాల్చివేత
శ్రీనగర్: లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ కాసిం భద్రతా బలగాల కాల్పుల్లో హతమయ్యాడు. శ్రీనగర్కు 40 కిలోమీటర్ల దూరంలో గల బందిపొరాలో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య బుధవారం రాత్రి భారీ ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
ఈ ఎన్కౌంటర్లో గురువారం తెల్లవారుజామున కాసిం మరణించాడు. ఉద్ధంపూర్ దాడుల ప్రధాన సూత్రధారి కాసిం. ఉద్ధంపూర్లో 2013 జూన్లో మిలిటెంట్లు జరిపిన దాడిలో ఎనిమిది సైనికులు మరణించారు.
బుధవారం సాయంత్రం గస్తీ తిరుతున్న భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఆ తర్వాత అటవీ ప్రాంతంలో ఆశ్రయం తీసుకున్నారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 14 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన జవాను ఒకతను గాయపడ్డాడు. చికిత్స పొందుతూ అతను మరణించాడు.
దాంతో భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో కాసిం హతమయ్యాడు. ఇంతకు ముందు కాసి ఇంటలిజెన్స్ పోలీసు అధికారి అల్తాఫ్ అహ్మద్ను హత్య చేశాడు.