లష్కరే టాప్ కమాండర్ హతం.. మరో ఉగ్రవాది కూడా, సోపియాన్లో ఎన్కౌంటర్
కశ్మీరులోని సోపియాన్లో ఈ తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. సాథిక్ ఖాన్ ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో కేంద్ర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. గాలింపు చేపట్టిన జవాన్లపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపాల్సి వచ్చింది.
కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మృతుల్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండరు ఇష్ఫాఖ్ దార్ అలియాస్ అబూ అక్రం ఉన్నాడు. ఇతను 2017 నుంచి నుంచి ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్నాడని కశ్మీర్ పోలీసు ఐజీ విజయకుమార్ చెప్పారు. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఆయన ట్వీట్ చేశారు.
ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఐజీ చెప్పారు. శుక్రవారం శ్రీనగర్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. శ్రీనగర్లో ఈ ఏడాది మూడు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఏడాది జమ్మూకశ్మీరు లోయలో జరిగిన ఎదురుకాల్పుల్లో 78 మంది ఉగ్రవాదులను భద్రతా సంస్థలు మట్టుబెట్టాయి.