హత్రాస్ గ్యాంగ్ రేప్... బాధితురాలి కుటుంబంతో డీజీపీ భేటీ... ఏం మాట్లాడారు...?
హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. నిన్నటిదాకా బాధితురాలి కుటుంబాన్ని ఎవరూ కలుసుకోకుండా కట్టడి చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం... సర్వత్రా వెల్లువెత్తిన విమర్శలతో ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. శనివారం(అక్టోబర్ 3) హత్రాస్ గ్రామంలోకి మీడియాను అనుమతించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఎలాగైనా హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్సీ అవస్తీ,హోంశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్తీ బాధితురాలి కుటుంబాన్ని కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
హత్రాస్ : యూపీ సర్కార్ తీరుపై జర్నలిస్ట్ యూనియన్ దిగ్భ్రాంతి... ఎందుకు అనుమతించట్లేదు?
ఏం మాట్లాడారు....
బాధితురాలి కుటుంబంతో మాట్లాడిన అనంతరం అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్తీ మీడియాతో మాట్లాడారు.' ఆ కుటుంబంతో మేము మాట్లాడాం... వాళ్లు తమ సమస్యలు చెప్పుకున్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటాం. వాళ్లకు న్యాయం జరుగుతుందని భరోసానిచ్చాం. ప్రస్తుతం సిట్ బృందం దర్యాప్తు జరుపుతోంది..' అని వెల్లడించారు. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత ఉన్నతాధికారులు బాధితురాలి కుటుంబాన్ని కలుసుకోవడం ఇదే మొదటిసారి. బాధిత కుటుంబంతో తమ భేటీకి సంబంధించి అధికారులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్కు ఒక నివేదిక సమర్పించనున్నారు.
ఆ ఆరోపణలను ఖండించిన అధికారులు
మరోవైపు ఈ కేసుపై సిట్ బృందం దర్యాప్తు పూర్తయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 14 లోగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. ఇంకా చాలా గడువు ఉన్నప్పటికీ సిట్ అధికారులు వేగవంతంగా విచారణను పూర్తిచేసినట్లు తెలుస్తోంది. సిట్ విచారణ నేపథ్యంలోనే హత్రాస్ గ్రామంలోకి ఎవరినీ అనుమతించట్లేదని అధికారులుల వెల్లడించారు.బాధిత కుటుంబాన్ని నిర్బంధించారని... వాళ్ల సెల్ఫోన్లు లాక్కున్నారని సాగుతున్న ప్రచారాన్ని జాయింట్ మెజిస్ట్రేట్ ప్రేమ్ ప్రకాశ్ మీనా ఖండించారు.
Recommended Video
ఎట్టకేలకు మీడియాకు అనుమతి...
తీవ్ర విమర్శల నేపథ్యంలో అధికారులు శనివారం ఎట్టకేలకు బారికేడ్లను తొలగించి కేవలం మీడియాను మాత్రం అనుమతించారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబం మీడియాతో మాట్లాడుతూ సిట్ బృందం నిందితులతో చేతులు కలిపిందని ఆరోపించారు. ఘటనపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు బయలుదేరారు. ఇప్పటికే ఓసారి పోలీసులు రాహుల్ను అడ్డుకోవడం.. తోపులాట చోటు చేసుకున్న నేపథ్యంలో... తాజా పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.