వడ్డీ వ్యాపారి టార్చర్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిప్పంటించుకున్నారు, ఫిర్యాదు చేసినా!
చెన్నై: ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం చెయ్యలేదని ఆరోపిస్తూ ఇద్దరు చిన్నారులతో సహ ఒకే కుటుంబంలోని నలుగురు కలెక్టర్ కార్యాలయంలో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఘటన తమిళనాడులోని తిరునల్వేలీ జిల్లాలో జరిగింది.
తిరునల్వేలి జిల్లాలోని కాశీధర్మం గ్రామంలో నివాసం ఉంటున్న ఎస్సక్కిముత్తు (30), ఆయన భార్య సుబ్బలక్ష్మి, వీరి కుమార్తెలు శరణ్య (5), భరణ్య (18 నెలలు) నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తిరునల్వేలి జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి కార్యాలయంలోనే సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎస్సక్కిముత్తు సోదరుడు గోపి అతనికి పరిచయం ఉన్న ముత్తులక్ష్మి అనే ఆమె దగ్గర రూ. 2.34 లక్షలు వడ్డీకి రుణం తీసుకున్నాడు. ఇప్పటికే ఎస్సక్కిముత్తు రూ. 2 లక్షలకు పైగా రుణం చెల్లించాడు. వడ్డీ మాత్రం ఇచ్చారని, తీసుకున్న రుణం మొత్తం చెల్లించాలని ముత్తులక్ష్మి వీరి మీద ఒత్తిడి చేశారు.
ఇప్పటికే నగదు పూర్తిగా చెల్లించినా ముత్తులక్ష్మి ఒత్తిడి చేస్తున్నారని, మాకు న్యాయం చెయ్యాలని ఎస్కక్కిముత్తు గతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అధికారులు ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎస్సక్కిముత్తు విసిగిపోయాడు.
వడ్డీ వ్యాపారి ముత్తులక్ష్మి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకున్న ఎస్సక్కి ముత్తు కుటుంబ సభ్యులతో కలిసి కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రగాయాలైన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.