దేశంలో మొత్తం 7.86 లక్షల ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్: ఐదో రోజు లక్షా 12వేలు, 10 మందికి అస్వస్థత
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఐదో రోజు టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని కేంద్రం తెలిపింది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు దేశంలో 7.86 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ను తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
బుధవారం ఒక్క రోజే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లక్షా 12వేల(1,12,007) మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది. ఇందులో కేవలం 10 మందికి మాత్రమే స్వల్ప ఇబ్బందులు తలెత్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఢిల్లీలో నలుగురు, కర్ణాటకలో ఇద్దరు, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున స్వల్ప అస్వస్థతకు గురైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని తెలిపారు.
భారతదేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటి వరకూ ఎవరూ తీవ్ర అస్వస్థతకు గురవ్వలేదని ఆయన తెలిపారు.
భారతదేశం బుధవారం కొత్తగా 13,823 కోవిడ్ -19 కేసులు, 162 మరణాలు నమోదయ్యాయి, మొత్తం కేసుల సంఖ్య 1,05,95,660గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 1,97,201 క్రియాశీల కేసులు ఉండగా, మొత్తం మరణాల సంఖ్య 1,52,718గా ఉంది.
అదే సమయంలో, భూటాన్, మాల్దీవులకు బుధవారం భారతదేశం కోవిడ్ 19 వ్యాక్సిన్లను పంపింది. భారతదేశం నుంచి కరోనా వ్యాక్సిన్ పొందిన దేశాలుగా ఈ రెండు దేశాలు అవతరించాయి. ఇరు దేశాలకు చేరుకున్న వ్యాక్సిన్ల ఫోటోలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్లో పంచుకున్నారు. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్లకు అవసరమైన నియంత్రణ ఆమోదాలు ఇచ్చిన తర్వాత వ్యాక్సిన్లను అందజేయనున్నారు.