73కు చేరిన కరోనా కేసులు.. దేశమంతటా ప్రభావం.. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న మరణాలు
కరోనా మహమ్మారి కాటుకు ప్రపంచ వ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య 4,640కు పెరిగింది. మన దేశంలోనూ వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. గురువారం నాటికి మన దగ్గర 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ కరోనాపై లోక్ సభలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక ప్రకటనలు చేశారు.
Recommended Video
దేశంలో కరోనా వ్యాప్తి ఆందోళనకరమేనని, కేసుల సంఖ్య 73కు పెరిగిందని, అయితే అత్యవసర పరిస్థితులకు తగ్గట్లు ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందిస్తున్నది జైశంకర్ చెప్పారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీ ప్రయాణాలు వాయిదే వేసుకుంటే మంచిదని ఆయన సూచించారు. వైరస్ విజృంభిస్తోన్న ఇరాన్లో దాదాపు 6,000 మంది భారతీయులు చిక్కుపోయారని, వారిలో విద్యార్థులు, యాత్రికులు ఉన్నారని, అందరినీ వీలైనంత తొందరగా స్వదేశానికి తీసుకొచ్చేందకు ప్రయత్నిస్తామని జైశంకర్ భరోసా ఇచ్చారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) కరోనావైరస్ ను మహమ్మారి(పడమిక్)గా ప్రకటించిన నేపథ్యంలో మరింత అలర్ట్ అయ్యామని, విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 10 కింద చర్యలు చేపట్టామని చేపట్టేందుకు కేంద్రం రెడీగా ఉందని, అందులో భాగంగా 125 ఏళ్లనాటి ఎపిడెమిక్ డిసీజెస్ చట్టాన్ని అమలు చేయాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ తెలిపారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలో నమోదైన 73 పాజిటివ్ కేసుల్లో 56 మంది భారతీయులుకాగా, మిగతా 17 మంది విదేశీయులని కేంద్రం తెలిపింది. రాష్ట్రాల వారీగా 17 పాజిటివ్ కేసులతో కేరళ టాప్ లో ఉంది. మహారాష్ట్రలో 11, కర్నాటకలో 4, ఉత్తరప్రదేశ్ లో 10, లదాక్ లో 3, ఢిల్లీలో 6, పంజాబ్, కాశ్మీర్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్ లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైంది.
కరోనా పుట్టిన చైనాలో ప్రస్తుతం ముమ్మర స్థితి దాటిపోయిందని, ఆ దేశ ఆరోగ్య కమిషన్ అధికారిక ప్రతినిధి ప్రకటించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ ఏప్రిల్ 15 వరకు వీసాల జారీని నిలిపేసింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడినవారి సంఖ్య 1.26 లక్షలకు పెరిగింది. ఇప్పటికే వైరస్ సోకినవాళ్లలో 68,326 మందిలో చికిత్సతో లక్షణాలు తగ్గాయి.
మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు బయటపడటంతో ఉద్ధవ్ సర్కారు అలెర్ట్ అయింది. ఆరోగ్య శాక అధికారులతో గురువారం అత్యవసరంగా సమావేశమైన సీఎం ఉద్దవ్ ఠాక్రే.. వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. కరోనా భయాల నేపథ్యంలో ఈనెల 29 దాకా జరగాల్సిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను శనివారం(ఈనెల 14)తో ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.