ఇండియాలో 10శాతం సంపద ఆ 20మంది వద్దే?: ఏటా పెరిగిపోతున్న సంపన్నుల ఆదాయం..
భారత ఆర్థిక వ్యవస్థ 2ట్రిలియన్ డాలర్లుగా ఉంటే, అందులో 200బిలియన్ డాలర్లకు పైగా సంపద దేశంలోని టాప్-20పారిశ్రామికవేత్తల దగ్గరే ఉంది.
న్యూఢిల్లీ: ఆర్థికంగాను, మానవ వనరుల పరంగాను భారత్ అగ్రరాజ్యాలకు ధీటుగా నిలబడగల దేశం. కానీ ఆర్థిక సంపదంతా బడాబాబుల వద్దే పోగై ఉండటం.. దేశంలో పేదరికాన్ని కూడా అదే స్థాయిలో పెంచింది. తాజాగా దీనికి సంబంధించి బ్లామ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
భారత ఆర్థిక వ్యవస్థ 2ట్రిలియన్ డాలర్లుగా ఉంటే, అందులో 200బిలియన్ డాలర్లకు పైగా సంపద దేశంలోని టాప్-20పారిశ్రామికవేత్తల దగ్గరే ఉంది. 2ట్రిలియన్ డాలర్లు అంటే, ఇండియన్ కరెన్సీలో కోటి కోట్లకు పైమాటే. ఇందులో 10శాతం మేర సంపద కేవలం 20మంది వ్యక్తుల వద్ద పోగై ఉండటం గమనార్హం.
2017తొలి 7నెలల కాలంలో ఇండియన్ టాప్-20 ఇండస్ట్రియలిస్టుల సంపద దాదాపు 50బిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్ వెల్లడించింది. ఈ 20మంది 1బిలియన్ డాలర్లు(రూ.6400కోట్లు) లేదా అంతకంటే ఎక్కువగా తమ సంపదను పెంచుకున్నట్లు పేర్కొంది.
ఇక దేశంలోనే అత్యధిక ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదను ఏకంగా 13బిలియన్ డాలర్లు పెంచుకున్నట్లు తెలిపింది. అదే బాటలో ఆదానీ గ్రూపుకు చెందిన గౌతమ్ ఆదానీ, విప్రో అజిమ్ ప్రేమ్ జీ, ఆర్కే దమానీ వంటి వారు తమ సంపదను పెంచుకున్నట్లు వెల్లడించింది. వీరి సంపద 3-4బిలియన్ డాలర్ల వరకు పెరిగి ఉంటుందని అంచనా వేసింది.
కాగా, ప్రస్తుతం రిలయన్స్ షేర్స్ గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. జియోను విజయవంతంగా లాంచ్ తో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక విప్రోను ప్రమోట్ చేస్తున్న అజీమ్ ప్రేమ్ జీ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్సులో వాటా కలిగి ఉన్నారు.
అంతేకాక ఎన్.సీ.సీ, జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, జేఎం ఫైనాన్సియల్ సంస్థల్లోను ఆయనకు వాటాలు ఉన్నాయి. దీంతో అజీమ్ ప్రేమ్ జీ సంపద 3.8బిలియన్ డార్లు ఎగిసి 16బిలియన్ డాలర్లకు చేరుకుంది.