రాజకీయాల్లో మర్యాదకు ఆమె ఉదాహరణ.. నిర్మలా సీతారామన్కు శశిథరూర్ ప్రశంస
తిరువనంతపురం : రాజకీయాల్లో వారిద్దరు బద్ధ శత్రువులు. వారి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. అయితే తమ శతృత్వం రాజకీయాల వరకే పరిమితమని నిరూపించారు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్. హాస్పిటల్లో ఉన్న ప్రత్యర్థి పార్టీకి నేతను పరామర్శించి ప్రశంసలు పొందారు.
వారణాసిలో వార్ వన్ సైడ్ కాదు..!
శశిథరూర్కు నిర్మలా సీతారామన్ పరామర్శ
సోమవారం తులాభారంలో గాయపడిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆయనను పరామర్శించారు. కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆమె ఉదయం తిరువనంతపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు వెళ్లి శశిథరూర్ను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
మర్యాదకు ఉదాహరణ నిర్మలా
నిర్మలా సీతారామన్ రాకపై శశిథరూర్ స్పందించారు. తనను పరామర్శించేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో మర్యాద అనేది అరుదుగా కనిపిస్తుందని, అందుకు రక్షణ మంత్రి ఓ ఉదాహరణ అని ప్రశంసించారు. కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ పరామర్శించేందుకు రావడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. తిరువనంతపురంలో తనపై పోటీకి సైయ్యన్న ఎల్డీఎఫ్ అభ్యర్థి దివకరన్ ఫోన్లో పరామర్శించిన విషయాన్ని శశిథరూర్ ట్వీట్లో ప్రస్తావించారు.
త్వరలోనే శశిథరూర్ ప్రచారం
శశిథరూర్ ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో డాక్టర్లు మంగళవారం ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశముంది. త్వరలోనే ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశముంది. కేరళ నూతన సంవత్సరాది విషును పురస్కరించుకుని శశిథరూర్ సోమవారం స్థానిక ఆలయంలో తులాభారం నిర్వహించారు. అయితే మొక్కు తీర్చుకునే సమయంలో త్రాసు గొలుసు ఒక్కసారిగా తెగిపోవడంతో తీవ్రంగా గాయపడ్డ ఆయను వెంటనే హాస్పిటల్కు తరలించారు.