మర్మాంగాలను తాకాడని.. పోలీసులకు ఫిర్యాదు
ముంబై : స్కూల్ విద్యార్థుల పరస్పర లైంగిక దాడి ఆరోపణలతో ముంబై పోలీసులు తలలు పట్టుకున్నారు. దక్షిణ ముంబైలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఐదో తరగతి, ఆరవ తరగతి చదువుతోన్న ముగ్గురు విద్యార్థులు ఒకరిపై ఒకరు లైంగిక దాడి ఆరోపణలు చేస్తూ.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసును ఎలా పరిష్కరించాలో అర్థం కాని పోలీసులు 'హోమో సెక్సువల్' నేర చట్టం ప్రకారం సెక్షన్-377 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఐదో తరగతి చదువుతోన్న ఓ విద్యార్థి స్కూల్ లో టాయ్ లెట్ కు వెళ్లిన సందర్బంలో ఆరో తరగతి విద్యార్థులిద్దరు తన మర్మాంగాలను తాకారంటూ తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు.. స్కూల్ యాజమన్యాన్ని నిలదీశారు. చొరవ తీసుకున్న యాజమాన్యం సదరు ఆరో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పిలిపించి మాట్లాడింది.
కాగా.. సదరు ఆరో తరగతి విద్యార్థులు కూడా అదే ఆరోపణ చేశారు. ఐదో తరగతి విద్యార్థే తమ మర్మాంగాలను తాకాడంటూ ఆరోపణ చేశారు. దీంతో విషయం కాస్త గామ్దేవి పోలీస్ స్టేషన్ కు చేరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే ఇలాంటి కేసులకు సంబంధించి అరెస్టులు ఉండవని స్పష్టం చేశారు పోలీసులు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని చిల్డ్రన్ కరెక్షన్ హోమ్ కు పంపిస్తామని చెప్పారు. కాగా, పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కూడా విద్యార్థులకు వివరిస్తున్నామని, అయినా.. ఇలాంటి ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయో అర్థం కావడం లేదంటున్నారు స్కూల్ అధికారులు.