గయలో 144 సెక్షన్.. ఎందుకో తెలుసా?
గయ : రుతుపనాలు దేశంలోకి ప్రవేశించి రోజులు గడుస్తున్నా ఎండలు మాత్రం తగ్గడం లేదు. నైరుతి మందగమనంతో ఇప్పటికే చాలా రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బీహార్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. గత శనివారం వరకు అక్కడ ఎండదెబ్బకు 60 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గయ సిటీ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
గయలో ఐపీసీ సెక్షన్ 144 అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాధారణంలో ఘర్షణలు, శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు జనం ఒకచోట గుమిగూడకుండా ఈ సెక్షన్ విధిస్తారు. అయితే గయలో మాత్రం జనాన్ని ఎండ నుంచి రక్షించేందుకు అమలుచేస్తున్నారు. 144 విధించడం వల్ల ప్రజలు బయటకురాకుండా ఉంటారని అలా వారిని ఎండదెబ్బ నుంచి కాపాడుకోవచ్చని అధికారులు అంటున్నారు.
బీహార్ రాజధాని పాట్నాకు 116 కిలోమీటర్ల దూరంలో ఉన్న గయలో వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ పొడి వాతావరణం కారణంగా జనం వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు భవన నిర్మాణ కార్మికులు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పనిచేయకూడదని అధికారులు ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే పనులు ఉదయం పదిన్నరలోపే పూర్తిచేయాలని స్పష్టం చేశారు.