హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్కు భారీ జరిమానా!
లక్నో: ట్రాఫిన్ నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించడం సాధారణమే. కానీ, ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. హెల్మెట్ ధరించలేదని ఓ ట్రాక్టర్ డ్రైవర్కు భారీ జరిమానా విధించారు. దీంతో సదరు డ్రైవర్ ఆశ్చర్యంతోపాటు ఆవేదనకు గురయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. గఢ్ముక్తేశ్వర్ గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్కు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించలేదని గురువారం రూ. 3000 జరిమానా విధించారు. అంతేగాక, డ్రైవింగ్ లైసెన్స్ తనతో ఉంచుకోలేదని ఈ చలాన్ విధించినట్లు నోటీసు అందజేశారు. దీంతో బాధితుడు ట్రాఫిక్ అధికారులను సంప్రదించాడు.
ట్రాక్టర్ను నడిపిస్తున్న తనకు హెల్మెట్ లేదంటూ జరిమానా విధించడం ఏంటని ప్రశ్నించాడు. పరిశీలించిన అధికారులు చలాన్ విధించే క్రమంలో కంప్యూటర్లో టైప్ చేసేప్పుడు వచ్చిన లోపంగా గుర్తించారు. అతనికి విధించిన చలాన్ను రద్దు చేసినట్లు చెప్పారు.
కాగా, సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహనాల సవరణ చట్టం దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రాలు ఈ సవరణ చట్టం ప్రకారం జరిమానాలు విధించవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. దీంతో పలు రాష్ట్రాలు పాత జరిమానాలనే కొనసాగిస్తున్నాయి.
కొన్ని రాష్ట్రాలు మాత్రం కొత్త వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు జరిమానాలను కొత్త చట్టం ప్రకారం ఉన్న జరిమానాలను కొంత తగ్గించి విధిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తమ రాష్ట్రాల్లో కొత్త చట్టం ప్రకారం జరిమానాలను విధించమని ప్రకటించాయి.
కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై రూ. 500-10,000 వరకు జరిమానా, ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉంది. అంతేగాక, ద్విచక్ర వాహనంపై వెళ్లే నాలుగేళ్లలోపు పిల్లలూ హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది.
హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే రూ. 1000 జరిమినా విధిస్తారు. నిర్ణీత వేగం కంటే ఎక్కువ వేగంతో వెళితే.. రూ.1000-2,000 వరుక జరిమానా విధించడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితితిలో ప్రయాణించే వాహనాలు అంబులెన్స్, ఫైరింజిన్లకు దారి ఇవ్వకపోతే రూ. 10వేలు జరిమానా విధిస్తారు. అనర్హత వేటుపడిన డ్రైవర్ వాహనం నడిపితే రూ. 10వేలు జరిమానా విధిస్తారు.