Red Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలు
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ.. దేశ రాజధానిలో రైతులు నిర్వహిస్తోన్న ట్రాక్టర్ల ర్యాలీ.. క్రమంగా హింసాత్మకంగా రూపుదాల్చింది. ఢిల్లీ పోలీసులు రైతులపై లాఠీ ఛార్జీకి దిగడంతో.. వాళ్లు కూడా ఎదురుదాడికి దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఫలితంగా- దేశ రాజధాని మొత్తం రణరంగాన్ని తలపిస్తోంది.. రక్తసిక్తమైంది. తమ నిరసన ప్రదర్శనలో భాగంగా.. రైతులు తాము అనుకున్నది సాధించారు. ప్రతిష్ఠాత్మక, చారిత్రాత్మక కట్టడం ఎర్రకోటను ముట్టడించారు. రెడ్ ఫోర్ట్పై తమ జెండాను ఎగురవేశారు. లక్షలాదిమందిగా తరలి వచ్చిన రైతులను అడ్డుకోవడం ఢిల్లీ పోలీసులకు పెనుభారంలా మారింది.
Recommended Video
ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ
లక్షలాదిమందిని నిలువరించలేక..
అయిదంచెల భద్రత వ్యవస్థను రూపొందించినప్పటికీ.. రైతుల ధాటి ముందు అవి నిలువలేకపోయాయి. భద్రతను తుత్తునీయలు చేస్తూ వారు ఎర్రకోటకు చేరుకున్నారు. తమ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం వేళ.. న్యూఢిల్లీలో రైతులు ట్రాక్టర్ల ద్వారా నిరసన ప్రదర్శనలను నిర్వహించుకోవడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చిన విషయం తెలిసింందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. నిర్దేశించిన మార్గాల్లో మాత్రమే ట్రాక్టర్లతో నిరసన ప్రదర్శనలను నిర్వహించాల్సి ఉంటుందని ఇదివరకే రైతు సంఘాాల నాయకులను ఆదేశించారు.
అడ్డుకునే ప్రయత్నాల్లో
మధ్యాహ్నం 12 గంటల నుంచి మాత్రమే ఢిల్లీలోకి ప్రవేశించాల్సి ఉంటుందని సూచించారు. వేరే మార్గాల్లో ప్రవేశించకుండా పోలీసులు బ్యారికేడ్లను అమర్చారు. దీన్ని రైతులు పట్టించుకోలేదు. ఉదయం 8 గంటల నుంచే ఘాజీపూర్, టిక్రి, సింఘు సరిహద్దుల నుంచి నగరం లోనికి రావడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచే ఉద్రిక్త పరిస్థితులు ఆరంభం అయ్యాయి. ఘాజీపూర్, టిక్రీ, సింఘు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు బలగాలు.. రైతులను అడ్డుకోవడానికి విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా వారితో ఘర్షణలకు దిగారు.
ఒక్కో మార్గంలో వేలాదిమందిగా తరలివచ్చిన రైతులను నిరోధించ లేకపోయారు. వారిపై టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించాల్సి వచ్చింది. అయినప్పటికీ.. రైతులు ముందుకే సాగడంతో అనేక చోట్ల లాఠీ ఛార్జీ చేశారు. ఫలితంగా రైతులు కూడా ఎదురుదాడికి దిగారు. చాలా చోట్ల రైతులు విధ్వంసానికి దిగారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులను ధ్వంసం చేశారు. ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేశారు. ప్రత్యేకించి ఐటీఓ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీఓ వద్ద పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు దాటుకుని ముందుకు సాగడానికి ప్రయత్నించారు.
అదనపు బలగాలను
వారిని అడ్డుకోవడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. రక్తసిక్తమైంది. పరిస్థితులు చేయి దాటుతుండటంతో అదనపు బలగాలను ఆయా ప్రాంతాలకు తరలించారు. లక్షలాది మంది ఒక్కసారిగా ఎర్రకోటకు చేరుకున్న అనంతరం ప్రహరీ గోడలను అధిగమించి.. లోనికి దూసుకెళ్లారు. జెండా దిమ్మెను ఎక్కి.. దానికి తమ జెండాలను కట్టారు. వాటిని ఎగురవేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. రైతుల ముసుగులో అసాంఘిక శక్తులు, ఖలిస్తాన్ ప్రతినిధులు చొరబడ్డారంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. విధ్వంసానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు.