viral video : ఢిల్లీలో పోలీసులపైకి దూసుకొచ్చిన ట్రాక్టర్లు- భయంతో పరుగులు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసగా రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ర్యాలీలో పాల్గొన్న కొందరు నిరసనకారుల ప్రవర్తనే ఇందుకు కారణం. ఢిల్లీలో రైతులు ప్రవేశించకుండా సరిహద్దుల్లో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యారికేడ్లను ఛేధించుకుంటూ ఢిల్లీలోకి ప్రవేశించిన రైతులు, నిరసనకారులు అనంతరం పోలీసులపై ప్రతాపం చూపించారు. ట్రాక్టర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి ట్రాక్టర్లు పోనిచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుంటున్నా వినకుండా ట్రాక్టర్లను వారిపైకి నడిపించారు. దీంతో పోలీసులు కూడా భయంతో పరుగులు తీశారు. ట్రాక్టర్లను అడ్డుకోకపోతే ఓ సమస్య, అడ్డుకుంటే మరో సమస్య అన్నట్లుగా పోలీసుల పరిస్ధితి తయారైంది. చివరకు పలు ట్రాక్టర్లు ఢిల్లీలోకి వెళ్లిపోయాయి.
#WATCH Violence continues at ITO in central Delhi, tractors being driven by protestors deliberately try to run over police personnel pic.twitter.com/xKIrqANFP4
— ANI (@ANI) January 26, 2021
అయితే పహారా కాస్తున్న పోలీసులపై నిరసనకారులు ట్రాక్టర్లు పోనివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాల తీరు ఎలా ఉన్నా విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై రైతులు ఇంత కాఠిన్యం చూపడం అవసరమా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన ట్రాక్టర్లు పోలీసులను బలి తీసుకుంటే పరిస్ధితి ఎలా ఉండేదన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. దీంతో రైతుల ముసుగులో ఉన్న నిరసనకారులు పోలీసులపైకి ట్రాక్టర్లు పోనిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.