ఆ ఒక్క చర్యతో రైతుల పట్ల వ్యతిరేకత ఏర్పడిందా? రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ.. దేశ రాజధానిలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల మహా ప్రదర్శన హింసాత్మకంగా రూపుదాల్చింది. ఢిల్లీ వ్యాప్తంగా అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రణరంగాన్ని తలపించాయి. రైతులు, పోలీసుల మధ్య పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాళ్లు రువ్విన సంఘటనలు నమోదు అయ్యాయి. బ్యారికేడ్లను దాటుకుంటూ లక్షలాదిగా తరలి వచ్చిన రైతులను నిలువరించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరిక లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది కాస్తా యుద్ధ వాతావరణానికి దారి తీసింది.
రైతులు వేలాదిమంది ఎర్రకోటను ముట్టడించడం, తమ పతాకాన్ని ఎగురవేయడం పట్ల దేశవ్యాప్తంగా ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనపై స్పందిస్తున్నారు. రైతులకు అండగా నిలిచిన వారు కూడా ఎర్రకోటను ముట్టడించడాన్ని తప్పు పడుతున్నారు. ఇలాంటి చర్యలను ఏ మాత్రం ప్రోత్సహించలేమని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, శశిథరూర్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్.. రైతుల వైఖరి పట్ల స్పందించారు. సమర్థనీయం కాదని పేర్కొన్నారు.
हिंसा किसी समस्या का हल नहीं है। चोट किसी को भी लगे, नुक़सान हमारे देश का ही होगा।
— Rahul Gandhi (@RahulGandhi) January 26, 2021
देशहित के लिए कृषि-विरोधी क़ानून वापस लो!
ఏ సమస్యకు కూడా హింస పరిష్కారం చూపబోదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ హింసాత్మక పరిస్థితుల్లో ఎవరికి గాయాలు తగిలినా.. ఎవరు గాయపడినా.. అది దేశానికే నష్టదాయకమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మూడు వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ప్రతిబంధకాలుగా మారిన ఆ బిల్లులను ఉపసంహించుకోవాలని సూచించారు.
Most unfortunate. I have supported the farmers’ protests from the start but I cannot condone lawlessness. And on #RepublicDay no flag but the sacred tiranga should fly aloft the Red Fort. https://t.co/C7CjrVeDw7
— Shashi Tharoor (@ShashiTharoor) January 26, 2021
తాము మొదటి నుంచీ రైతులకు అనుకూలంగా ఉంటూ వస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. కొన్ని రోజుల పాటు రైతులు నిర్వహించిన నిరసన దీక్షలకు అండగా ఉన్నామని, తాజాగా చోటు చేసుకున్న ఘటనలను మాత్రం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చారిత్రాత్మకమైన ఎర్రకోటపై త్రివర్ణ పతాకం మినహా మరో జెండా ఎగరడానికి వీల్లేదని చెప్పారు. రైతులు తమ సొంత పతాకాన్ని ఎగురవేయడాన్ని ఎవరూ సమర్థించబోరని తేల్చి చెప్పారు.
రైతులు హింసాత్మక చర్యలకు దిగొద్దని, శాంతియుత వాతవారణానికి కట్టుబడి ఉండాలని ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు. ర్యాలీని నిర్వహించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ.. తమకు నిర్దేశించిన మార్గాల్లో కాకుండా ఇలా ఎర్రకోటను ముట్టడించడం సరికాదని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు.
It is unfortunate that some farmers on tractors have deviated from the pre agreed & designated route. It is extremely important for the farmers to go back to the designated route&above all remain totally non-violent. Any indiscipline or violence will seriously damage the movement
— Prashant Bhushan (@pbhushan1) January 26, 2021