జోరుగా జల్లికట్టు పోటీలు.. బరిలో 2వేల ఎద్దులు.. మధురైలో భారీ సెక్యూరిటీ
Recommended Video
సంక్రాంతి(పొంగల్) పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్లు పోటీలు బుధవారం మొదలయ్యాయి. జల్లికట్టు క్రీడకు కేంద్రబిందువుగా ఉన్న మధురై ఏరియాలో అధికారుల పర్యవేక్షణలో, పటిష్ట భద్రత నడుమ పోటీలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో హాజరైన యువత కేరింతల మధ్య పోటీదారులు ఎద్దుల్ని లొంగదీసుకునే ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతోంది.
ఈసారి పక్కగా లెక్కలు..
కొన్నేండ్ల కిందట సుప్రీంకోర్టు జల్లికట్టును నిషేధించడం.. తీర్పుకు వ్యతిరేకంగా తమిళనాడు అంతటా ఆందోళనలు చెలరేగడం.. చివరికి కఠిన నిబంధనలతో క్రీడకు అనుమతి లభించడం తెలిసిందే. ఈసారి పోటీల్లో లెక్కలన్నీ పక్కాగా సిద్ధం చేశారు. పోటీలో మొత్తం 2వేల ఎద్దులకు మాత్రమే అనుమతిచ్చారు. అవనియాపురంలో 730, అలంగనళ్లూరులో 700, పలమేడులో 650 ఎద్దులు బరిలోకి దిగుతున్నాయి.
పోటీదారులకూ కండిషన్లు..
జల్లికట్టులో పాల్గొనే పోటీదారులకు సంబంధించి కూడా అధికారులు కచ్చితమైన నిబంధనల్ని రూపొందించారు. పోటీదారులు 75 మందిని కలిపి ఒక్కో జట్టుగా విభజించారు. ఒక జట్టు కేవలం 60 ఎద్దులతో మాత్రమే తలపడాల్సిఉంటుంది. ప్రేక్షకులకు, పోటీదారులకు మధ్య పటిష్టమైన బారికేడ్లను నిర్మించారు. గాయపడ్డవారికి చికిత్స అందించడానికి 20 ఆంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు.
రిటైర్డ్ జడ్జి, కలెక్టర్ ఆధ్వర్యంలో..
జల్లికట్టు పోటీలను గతంలో మాదిరి విచ్చలవిడిగా కాకుండా ఒక క్రమపద్ధతిలో జరగాలని మధురై హైకోర్టు బెంచ్ ఆదేశించింది. ఆ మేరకు పోటీల పర్యవేక్షకుడిగా మాజీ జిల్లా జడ్జి సీ.మాణికమ్ ను నియమించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి జడ్జి మాణికమ్.. జల్లికట్టు పోటీలు జరిగే ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.