సినిమా కాదు రియల్: చెన్నైలో ఫ్లైఓవర్ ను గొలుసులతో కట్టేసిన యూత్ !
చెన్నై నగరంలోని కతిపర గ్రేడ్ సెపరేటర్ ఫ్లై ఓవర్ మీద ఉన్న అన్ని రహదారులకు గొలుసులు చుట్టేసి తాళాలు వేసిన యువకులు పోలీసులు, ప్రభుత్వానికి చుక్కలు చూపించారు.
చెన్నై: ఢిల్లీలో తమ డిమాండ్ల కోసం ఆందోళన జరుపుతున్న తమిళ రైతులకు మద్దతుగా గురువారం చెన్నై నగరంలో యువతరం కదలివచ్చింది. ఒక్క సారిగా రోడ్ల మీదకు వచ్చిన విద్యార్థులు చెన్నై నగరంలోని గుండీ ప్రాంతంలోని కతిపర గ్రేడ్ సెపరేట్ లో ఫ్లై ఓవర్ ను ముట్టడించారు.
పెద్ద పెద్ద గొలుసులు తీసుకు వచ్చిన కతిపర గ్రేడ్ సెపరేటర్ లోని అన్ని రహదారులకు చుట్టేసి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. గత 32 రోజులుగా తమ డిమాండ్లు తీర్చాలని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులకు మద్దతుగా యువకులు నినాదాలు చేశారు.
పక్కాప్లాన్ తో వచ్చిన యువకులు
గురువారం ఉదయం 9 గంటల సమయంలో గండీ ప్రాంతంలోని కతిపర గ్రేడ్ సెపరేటర్ ఫ్లై ఓవర్ మీదకు వందలాది మంది యువకులు చేరుకున్నారు. తరువాత అక్కడ అనేక మార్గాలకు వెళ్లే అన్ని రహదారులకు గొలుసులు చుట్టేసి తాళాలువేశారు.
సినిమా చూపించారు
గిండీ ప్రాంతంలోని కతిపర గ్రేడ్ సెపరేట్ ఫ్లైఓవర్ మీదుగానే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లిరావాలి. విమానాశ్రయానికి రాకపోకలు అన్నీ ఈ కతిపర గ్రేడ్ సెపరేటర్ ఫ్లై ఓవర్ మీదుగానే జరుగుతుంటాయి. అయితే యువకులు గొలుసులు బిగించి తాళాలు వేయ్యడంతో వాహన సంచారం అస్తవ్యస్థం అయ్యింది.
చెన్నై నగరంలోకి వెళ్లి రావాలంటే
చెన్నై విమానాశ్రంతో పాటు నగరంలోని ఏడు ప్రధాన రహదారులకు వెళ్లాలంటే కతిపర గ్రేడ్ సెపరేటర్ ఫ్లై ఓవర్ మీదుగా నే సంచరించాలి. గురువారం ఫ్లై ఓవర్ మీద అన్ని రహదారులకు గొలుసు వేసి లాక్ చెయ్యడంతో కొన్ని వేల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
పోలీసులకు రెండు గంటలు పట్టింది
కతిపర గ్రేడ్ సెపరేటర్ ఫ్లై ఓవర్ మీద ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అక్కడికి చేరుకోవడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పోలీసులు నానా తంటాలుపడి ఫ్లై ఓవర్ మీదకు చేరుకుని యువకులను బలవంతంగా అరెస్టు చేశారు.
నో మీడియా, చేసిందిచాలు
ఆందోళనకు దిగిన యువకులు మీడియాతో మాట్లాడటానికి పోలీసులు అవకాశం ఇవ్వలేదు. అరెస్టు చేసిన యువకులను అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్లకు తీసుకు వెళ్లారు. వాహన సంచారం అస్తవ్యస్థం కావడంతో ప్రభుత్వ, ప్రయివేటు కంపెనీల ఉద్యోగులు, వ్యాపారులు నానాతంటాలు పడ్డారు.
మెరీనా బీచ్ ఆందోళన గుర్తుకు వచ్చేలా చేశారు
జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని చెన్నైలోని మెరీనా బీచ్ లో విద్యార్థలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అయితే మెరీనా బీచ్ ఆందోళనను తలతన్తెలా గురువారం యువకులు ఫ్లై ఓవర్ మీద ఆందోళన చేసి పోలీసులకు మరోసారి చుక్కలు చూపించారు.
పక్కా స్కెచ్, ఊహించని పోలీసులు
యువకులు కతిపర గ్రేడ్ సెపరేటర్ ఫ్లైఓవర్ మీద ఆందోళనకు దిగుతారని ఇంటిలిజెన్స్ వర్గాలతో పాటు పోలీసులు సైతం ఊహించలేకపోయారు. యువకులు నిర్వహించిన ఆందోళనకు ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, తమిళ సంఘం నాయకుడు గౌతమన్ మద్దతు తెలపడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎట్టేకలకు పోలీసులు ఫ్లై ఓవర్ మీద గొలుసులు కత్తిరించి వాహన సంచారం సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.