కేరళ మహిళాపోలీసుకు నిప్పుపెట్టిన ట్రాఫిక్ పోలీసు చికిత్స పొందుతూ మృతి
అలపుజా: కొద్దిరోజుల క్రితం కేరళలో ఓ మహిళా పోలీసు అధికారిణిపై ఓ ట్రాఫిక్ పోలీసు కత్తితో దాడి చేసి ఆమెకు నిప్పు పెట్టడంతో అక్కడికక్కడికే ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఘటనలో ట్రాఫిక్ పోలీసు అజాజ్కు కూడా తీవ్రగాయాలపాలు అవడంతో ఆయన్ను చికిత్స కోసం పోలీసులు ఓ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేర్చారు. చికిత్స పొందుతూ అజాజ్ కూడా మృతి చెందాడు. అజాజ్ పరిస్థితి బుధవారం సాయంత్రం విషమించిందని వైద్యులు తెలిపారు. దీంతో సాయంత్రం 5గంటల 40 నిమిషాలకు అజాజ్ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
సౌందర్య పుష్పకరేన్ అనే మహిళా పోలీసు అధికారిణితో కొంత దగ్గరగా అజాజ్ కదిలాడని పోలీసులు తెలిపారు. ఇక సౌందర్యతో ఎక్కడో బెడిసి కొట్టడంతో ఆమెను వెంబడించి కత్తితో దాడి చేసి నిప్పుపెట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అజాజ్ అరెస్టును రికార్డు చేసి అతని స్టేట్మెంట్ను మెజిస్ట్రేట్ తీసుకున్నారు. అంతా చేజారిపోవడంతోనే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తన స్నేహితులతో అజాజ్ చెప్పాడు.
సౌందర్యకు అప్పటికే వివాహమై ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఆమె భర్త ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సౌందర్యతో దగ్గర సంబంధాలు ఏర్పరచుకున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో వారిద్దరి మధ్య ఆర్థికలావాదేవీలు కూడా జరిగినట్లు అజాజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక సౌందర్యను వివాహం చేసుకుందామనుకునే సరికి ఆలోచన బెడిసికొట్టడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. దీంతో గత శనివారం సౌందర్య తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో విధులు ముగించుకుని తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతున్న సమయంలో వెనకాల నుంచి కారులో వచ్చిన అజాజ్... సౌందర్య బైకును ఢీకొట్టాడు. ఆమె కిందకు పడిపోగానే సౌందర్యపై కత్తితో దాడి చేసి పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు. అదే క్రమంలో మంటలు అజాజ్కు కూడా పాకాయి. దీంతో అజాజ్ కూడా తీవ్రగాయాలపాలయ్యాడు.