శశికళకు ట్రాఫిక్ రామస్వామి షాక్: మంత్రులతో 'ములాఖత్'కు అనుమతివ్వద్దని పిటిషన్
శశికళ మంత్రులతో ములాఖత్ కాకుండా చూడాలని కోరుతూ తాజాగా ట్రాఫిక్ రామస్వామి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చెన్నై: జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ అక్కడి నుంచే తన వ్యూహాలను అమలు చేయాలయన్న యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. తన అనయాయి పళనిస్వామి ద్వారా జైలు నుంచే ఆమె తన శత్రువులకు చెక్ పెట్టడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జైలుకు వెళ్లేముందు అమ్మ సమాధిపై శపథం చేసి మరీ వెళ్లారు.
అయితే పరిస్థితి చూస్తుంటే.. శశికళకు ప్రతికూలంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శశికళ మంత్రులతో ములాఖత్ కాకుండా చూడాలని కోరుతూ తాజాగా ట్రాఫిక్ రామస్వామి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శశికళను కలిసేందుకు మంత్రులకు అనుమతివ్వరాదని ఆయన తన పిటిషన్ ద్వారా కోరారు.
పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత నెల 15వ తేదీ నుంచి శశికళ, ఇళవరసి, సుధాకరన్ లు జైల్లో ఉన్నారని, అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్నవారిని కలిసేందుకు అన్నాడీఎంకె నేతలు పోటీ పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనను పక్కనబెట్టి శశికళను కలిసేందుకు మంత్రులు క్యూ కడుతుండటం సమంజసం కాదని, అందువల్లే తాను పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని అన్నారు.
కాగా, గతంలో జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలోను ఆమె చికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడించాలంటూ ట్రాఫిక్ రామస్వామి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.