వినాయక విగ్రహాల శోభాయాత్రలో ఘోర ప్రమాదం: 11 మంది జలసమాధి!
భోపాల్: వినాయక విగ్రహాల నిమజ్జనంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లిన బోటు చెరువు మధ్యలో తిరగబడింది. విగ్రహంతో పాటు అందులో ఉన్న యువకులు జలసమాధి అయ్యారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు 11 మృతదేహాలను వెలికి తీశాయి. గల్లంతైన వారి కోసం భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో శుక్రవారం తెల్లవారు జామున ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా అంగరంగ వైభవంగా కొనసాగిన వినాయకుడి శోభాయాత్ర విషాదకరంగా ముగిసింది.
భోపాల్ లోని శ్యామలా హిల్స్, నవ్ భర్ కాలనీ, బ్యాంక్ కాలనీ, ఐష్ బాగ్ వంటి ప్రాంతాల నుంచి వందలాది సంఖ్యలో వినాయకుడి విగ్రహాలు నిమజ్జనానికి తరలాయి. నగరంలోని ఖట్లాపూర్ ఘాట్ చెరువులో నిమజ్జనం చేయడానికి భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రంతా విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. శ్యామలా హిల్స్ ప్రాంతం నుంచి వచ్చిన ఓ విగ్రహాన్ని శుక్రవారం తెల్లవారు జామున నిమజ్జనానికి తీసుకెళ్లారు భక్తులు. ఓ చిన్న బోటులో విగ్రహాన్ని ఉంచి, అందులో 19 మంది ఎక్కారు. చెరువు మధ్యలోకి వెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనేది వారి ఉద్దేశం.
విగ్రహం బరువుతో పాటు సామర్థ్యానికి మించి 19 మంది భక్తులు ఎక్కడంతో.. బోటు తిరగబడింది. విగ్రహంతో పాటు భక్తులందరూ నీట మునిగారు. వారిలో ఒకరిద్దరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. బోటు తిరగబడిన దృశ్యాన్ని తిలకించిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ దళాల సభ్యులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 19 మందిలో 11 మంది జలసమాధి అయ్యారు. గాలింపు చర్యలు చేపట్టిన సిబ్బంది 11 మంది మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.