కిసాన్ పరేడ్ లో విషాదం; ఓ రైతు మరణం..పోలీసుల ఫైరింగ్ వల్లే అంటూ రైతుల నిరసన
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో, ఢిల్లీలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా పోలీసులు నిరసనకారులను కంట్రోల్ చేయడం కోసం బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. వాటర్ క్యానన్లను ఉపయోగించారు. అలాగే పలు చోట్ల పోలీసులు నిరసనకారులపై లాఠీలకు పని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని పోలీసులు పదేపదే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రైతులు శాంతియుతంగా చేస్తున్న తమ నిరసనను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య రైతుల కిసాన్ పరేడ్ కొనసాగుతుంది .
Recommended Video
ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ
సెంట్రల్ ఢిల్లీలోని మింటు రోడ్డు సమీపంలో ట్రాక్టర్ బోల్తా .. రైతు మృతి
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కిసాన్ పరేడ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలోని మింటు రోడ్డు సమీపంలో డి డి యు మార్గ్ వద్ద ఒక ట్రాక్టర్ బోల్తా పడడంతో, ట్రాక్టర్ కింద పడి ఒక రైతు మరణించాడు. మరణించిన రైతు పై జాతీయ జెండా కప్పి ఐ టి ఓ ఇంటర్ సెక్షన్ వద్ద రైతులు నిరసనకు దిగారు. పోలీసులు కాల్పులు జరపటం రైతు మరణానికి కారణమంటూ రైతులు ఆరోపిస్తున్నారు. రైతు ట్రాక్టర్ ను మలుపు తీసుకునే సమయంలో పోలీసులు కాల్పులు జరిపారని, ఆ ప్రమాదంలో రైతు మరణించాడని వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
పోలీసుల కాల్పుల వల్లే రైతు మరణించారని ఆందోళన
రైతు మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత అని మండిపడుతున్నారు .పోలీసులు కాల్పులు జరిపిన తర్వాత ట్రాక్టర్ బోల్తా పడింది అని, పోలీసుల కాల్పులు వల్లే ఈ ఘటన జరిగిందని రైతులు మృతదేహంతో ఆందోళన చేస్తున్నారు. మరో పక్క, రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఎట్టేకేలకు ఎర్రకోటకు చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రైతులు ఎర్రకోటను ముట్టడించారు. ఎర్రకోట బురుజుల పైకి చేరి జెండాలు ఎగరేశారు.అనేక ఉద్రిక్త పరిస్థితుల మధ్య హింసాత్మకంగా రైతుల ర్యాలీ మారింది.
హింసాత్మకంగా మారిన కిసాన్ పరేడ్ .. రైతు మృతితో విషాదం
రిపబ్లిక్ డే పరేడ్ కంటే ముందే ఉదయం ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోకి వివిధ ప్రాంతాల నుంచి భారీగా చేరుకున్నారు. వారిని నిరోధించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో రైతులు బారికేడ్లు దాటే ప్రయత్నం చేశారు. దీంతో వారిని నిరోధించే క్రమంలో భాష్పవాయిగోళాలు, లాఠీలకు పోలీసులు పని చెప్పారు. ఇక నిరసనకారులు కూడా పోలీసులపై పలు చోట్ల దాడులకు తెగబడ్డారు. ఢిల్లీలో ఉద్రిక్తంగా రైతన్నల నిరసనలు మారడంతో ప్రభుత్వం రైతన్నల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.
కిసాన్ ర్యాలీలో ఒక రైతు మృతి చెందటంతో రైతు సంఘాలు మండిపడుతున్నాయి.