జీతం ఇవ్వరు... ఇవ్వాలంటే శరీరాల్ని కూడా సమర్పించాల్సిందే... వెలుగులోకి సంచలన కథనం...
మరో నెల రోజుల్లో యావత్ దేశం 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. ఈ ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో దేశ రూపు రేఖలు చాలానే మారిపోయాయి. కానీ అప్పటికీ,ఇప్పటికీ పేదల బతుకు రేఖలు మాత్రం పెద్దగా మారలేదు. పైపెచ్చు వ్యవస్థ ఇప్పటికీ వాళ్లను లూటీ చేస్తూనే ఉంది. పేదలే కావచ్చు... కానీ మనిషై రక్తమాంసాలతో పుట్టినందుకు శరీరాలను కూడా దోపిడీ చేసే వ్యవస్థ తయారైంది. చేసిన పనికి జీతం డబ్బులు తీసుకోవాలన్నా.. శరీరాలను అర్పిస్తే తప్ప ఆ డబ్బులు చేతుల్లోకి రాని పరిస్థితి. దీనికి సంబంధించి ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే ఓ ఆసక్తికర కథనాన్ని వెలుగులోకి తెచ్చింది.
ఉత్తరప్రదేశ్... చిత్రకూట్...
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి 700కి.మీ దూరంలోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న చిత్రకూట్ జిల్లా అది. ఇక్కడి మైనర్ గిరిజన బాలికలు పేదరికం కారణంగా అక్రమ గనుల్లో పనిచేయాల్సి వస్తోంది. అయితే పనిచేసినందుకు రావాల్సిన వేతనాలు మాత్రం వీరికి అంత సులువుగా రావు. అక్కడ ఉండే కాంట్రాక్టర్లు,మధ్యవర్తులు వీరిపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారు. వేతనం రావాలంటే శరీరాలను కూడా అమ్ముకోవాల్సిందే అన్న షరతులు విధిస్తున్నారు.
15 ఏళ్ల లోపు బాలికలే...
నిజానికి వీళ్లలో చాలామంది స్కూల్కు వెళ్లి చదువుకోవాల్సిన వయసు. కానీ పేదరికం వీళ్లకు విద్యను దూరం చేసింది. ప్రస్తుతం అక్కడి అక్రమ గనుల్లో పనిచేస్తున్న మైనర్ బాలికల్లో 12-14ఏళ్ల వయసున్నవారే ఎక్కువగా ఉన్నారు. రోజు కూలీ కింద వీళ్లకు రూ.200-రూ.300 వరకు వస్తాయి. కానీ ఆ రోజు కూలీ అందుకోవాలంటే... అందుకు బదులుగా శరీరాలను ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇదీ బాలికల ఆవేదన...
కార్వి గ్రామానికి చెందిన రాణి(పేరు మార్చాం) అనే బాలిక మాట్లాడుతూ... 'పని కోసం మేము గనుల వద్దకు వెళ్లినప్పుడు అక్కడి కాంట్రాక్టర్లు మమ్మల్ని పనిలో పెట్టుకునేందుకు ఒప్పుకుంటారు. కానీ పని కావాలంటే శరీరాలను కూడా అమ్ముకోవాలన్న షరతు విధిస్తారు. మేము నిస్సహాయులం. ఒప్పుకోక తప్పదు. వాళ్లు మాతో పని చేయించుకుంటారు,లైంగిక దోపిడీకి పాల్పడుతారు. అయినా పూర్తి వేతనాలు ఇవ్వరు. ఒకవేళ లైంగిక కోర్కెలు తీర్చేందుకు తిరస్కరిస్తే... పనిలో నుంచి తీసేస్తామని బెదిరిస్తారు. పని లేకపోతే ఏమి తిని బతకాలి. కాబట్టి చివరకు వాళ్లు చెప్పినట్లు చేయాల్సి వస్తోంది.' అని ఆవేదన వ్యక్తం చేసింది.
ఒప్పుకోకపోతే చంపేస్తామని బెదిరింపులు...
దఫాయి గ్రామానికి చెందిన స్వప్న(పేరు మార్చాం) అనే మరో మైనర్ బాలిక మాట్లాడుతూ... 'కాంట్రాక్టర్లు వాళ్ల అసలు పేర్లు మాతో చెప్పరు. పని కావాలంటే వాళ్లు పెట్టే షరతులకు ఒప్పుకోక తప్పదని తెగేసి చెబుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో అందుకు ఒప్పుకుంటాం. కొన్ని సందర్భాల్లో.. ఒకేసారి ఒకరి కంటే ఎక్కువమంది మాపై లైంగిక దోపిడీకి పాల్పడుతారు. ఒకవేళ మేము అందుకు ఒప్పుకోకపోతే... కొండ పైనుంచి కిందకు విసిరేసి చంపేస్తామని బెదిరిస్తారు.' అని వాపోయింది.
తల్లిదండ్రులకూ తెలుసు... కానీ...
ఈ లైంగిక దోపిడీ గురించి వారి తల్లిదండ్రులకు కూడా తెలుసు. 'మేము నిస్సహాయులం. ఒక రోజు పనికి రూ.300-రూ.400 కూలీ ఇస్తామని చెప్తారు. కానీ కొన్నిసార్లు రూ.150కి మించి ఇవ్వరు. మా బిడ్డలు పని నుంచి ఇంటికి తిరిగొచ్చాక... అక్కడ ఎదురైన చేదు అనుభవాలను మాతో చెప్తారు. కానీ మేమేమీ చేయగలం. మేము కూలీలం. కుటుంబాలను పోషించుకోవడమే మాకు పెద్ద భారం. నా భర్త అనారోగ్యంతో ఉన్నాడు,ట్రీట్మెంట్ కూడా అందించాలి.' అని ఓ మహిళ తన ఆవేదన వెలిబుచ్చారు.
లాక్ డౌన్తో తిప్పలు...
అంతేకాదు,పనికి వచ్చే బాలికలు అందంగా తయారై రావాలని అక్కడి కాంట్రాక్టర్లు షరతులు విధిస్తున్నారని బాలికలు వాపోతున్నారు. ఒకవేళ మేకప్ లేకుండా అక్కడికి వెళ్తే... మేమిచ్చే డబ్బులతో ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ఇటీవలి లాక్ డౌన్ కారణంగా వీరి జీవితాలు మరింత చిన్నాభిన్నం అయ్యాయి. దీనిపై ఓ మహిళ మాట్లాడుతూ... ' 3 నెలలుగా మాకు పనిలేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా తిప్పలు పడుతున్నాం.' అని వాపోయారు.
ఎట్టకేలకు కదలిన యంత్రాంగం..
ఇక్కడి కుటుంబాలను,బాలికలను కాంట్రాక్టర్లు,మధ్యవర్తులు ఇంతలా వేధిస్తున్నా... వీళ్ల గురించి పట్టించుకున్నవారే లేరు. గనుల్లో దోపిడీని భరించలేక చాలామంది మహిళలు కడుపు మాడ్చుకునైనా సరే ఇళ్లకే పరిమితమయ్యారు.తమ కూతుళ్లను కూడా పని మాన్పించారు. మీడియా ద్వారా వెలుగుచూసిన ఈ కథనంపై ఇటీవలే జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. ఉత్తరప్రదేశ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఛైర్ పర్సన్ విశేష్ మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదేమీ తెలియదంటున్న పోలీసులు...!!
ఓవైపు జిల్లా మెజిస్ట్రేట్,బాలల హక్కుల సంఘం రంగంలో దిగి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతుండగా... స్థానిక ఏఎస్పీ మాత్రం అసలు ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు తమకు తెలియదని చెప్పడం గమనార్హం. ఇన్నేళ్లుగా ఇంతమంది మహిళలు,బాలికలు లైంగిక దోపిడీకి గురవుతుంటే... ఆ విషయం స్థానిక పోలీసులకు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.