దీపావళి మిగిల్చిన విషాదం ... పండుగ సరుకుల కోసం వెళ్లి ఆరుగురి దుర్మరణం
దీపావళి పండుగ పూట విషాదం నెలకొంది. పండుగ సరుకుల కోసం వెళ్లి ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీపావళి పండుగ అందరి జీవితాలలో వెలుగులు నింపితే పండుగను సంతోషంగా జరుపుకోవాలనుకున్న ఆరుగురు కుటుంబాల్లో చీకటిని నింపింది. అత్యంత విషాదాన్ని మిగిల్చింది.
తమిళనాడులోని మధురై జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కోడంగినాయక్కన్పట్టి నుంచి దీపావళి సరుకులు కొనేందుకు 13 మంది వ్యక్తులు ఆటోలో ఉసిలంబట్టికి బయలుదేరారు. 13 మంది ప్రయాణికులతో ఆటో ఓవర్లోడ్ కావడంతో కారంబట్టి సమీపంలో వీరి ఆటోను ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొంది. దీంతో ఆటో తునాతునకలైంది.
ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీంతో మృతుల కుటుంబాలలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతా సంతోషంగా దీపావళి పండుగ జరుపుకుందాం అనుకుంటే లారీ రూపంలో మృత్యువు వారిని కబళించి వేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఘోర రోడ్డు ప్రమాదంలో పండుగ పూట ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.