నాందేడ్ బెంగళూర్ రైలు ప్రమాదం: టెక్కీ మృతి
నాందేడ్(మహారాష్ట్ర): నాందేడ్ - బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన 24ఏళ్ల యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృత్యువాత పడ్డారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో నాందేడ్- బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో జరిగిన ప్రమాదంలో 26 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే.
కర్ణాటకలోని బెంగళూరులోని ఐబిఎం సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన అనిరుధ కులకర్ణి ఈ రైలు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే కులకర్ణికి బెంగళూరు నుంచి పుణెకు బదిలీ అయింది.
నాందేడ్లోని ఆనంద్నగర్కు చెందిన కులకర్ణి తన పాఠశాల స్థాయిని నాందేడ్లో, ఉన్నత చదువులను పుణెలో కొనసాగించారు. కాగా కులకర్ణి చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడని అతని ఇంటి పొరుగు వారైన అరుంధతి పురుందరే మీడియాకు తెలిపారు.
ఎంతో కష్టపడి చదువుకున్న కులకర్ణి తను అనుకున్న స్థితికి చేరుకోగలిగాడని అరుంధతి తెలిపారు. కులకర్ణి ప్రయాణిస్తున్న రైలుకు ప్రమాదం జరిగిందన్న సమాచారంతో కులకర్ణి కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లాకు హుటాహుటిన తరలివెళ్లారని తెలిపారు.